ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 8 మ్యాచ్ ల్లో రెండు మాత్రే గెలిచి, ఆరు ఓడిన ఆ టీమ్ దాదాపుగా ప్లేఆఫ్స్ కు దూరమైనట్లే. ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్ లూ గెలవడంతో పాటు ఇతర టీమ్స్ ఫలితాలపై ఆధారపడాలి. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ ను ఉద్దేశించి ధోని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వచ్చే ఐపీఎల్ సీజన్ లోనూ ధోని ఆడే సంకేతాలు కనిపిస్తున్నాయి.
“మనం సక్సెస్ కావడానికి మంచి క్రికెట్ ఆడటం ముఖ్యం. అలాగే మంచి క్రికెట్ ఆడకపోయినా ఎక్కువగా ఎమోషన్ కాకూడదు. మ్యాచ్ లు గెలవాలంటే క్యాచ్ లు ఉపయోగపడతాయి. ఇప్పుడు మేం ముందుకు సాగాలంటే అన్ని మ్యాచ్ లు గెలవాలి. అలా జరగకపోతే వచ్చే ఏడాది సరైన కాంబినేషన్ కోసం ప్రయత్నించడం ముఖ్యం’’ అని ధోని చెప్పాడు.
వచ్చే ఐపీఎల్ 2026 సీజన్ కోసం బలమైన ఎలెవన్ ను తయారు చేసుకోవడం ముఖ్యమని ధోని అన్నాడు. “అనేక మంది ఆటగాళ్లను మార్చడం సరికాదు. ఈ సారి ప్లేఆఫ్స్ కు అర్హత సాధించడానికి ప్రయత్నించడం ముఖ్యం. కానీ అలా చేయలేకపోతే వచ్చే ఏడాది కోసం బలమైన ఎలెవన్ ను రూపొందించుకుని తిరిగి వస్తాం’’ అని ధోని పేర్కొన్నాడు. దీంతో ధోని వచ్చే సీజన్ లోనూ ఆడబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం ముంబయి ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఛేజింగ్ లో ముంబయి 26 బంతులు ఉండగానే 177 పరుగుల లక్ష్యాన్ని అందుకుని 9 వికెట్ల తేడాతో గెలిచింది. తిరిగి ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ముంబయిని గెలిపించారు. ఫస్ట్ సీఎస్కే బ్యాటింగ్ లో డెబ్యూ బ్యాటర్ ఆయూష్ మాత్రె మెరుపులు.. శివమ్ దూబె, జడేజా హాఫ్ సెంచరీలతో ఫైటింగ్ స్కోరు చేసింది.
సూపర్ కింగ్స్ ఇప్పుడు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలంటే తమ మిగిలిన అన్ని మ్యాచ్లలో విజయం సాధించాలి. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ధోని తిరిగి సీఎస్కే కెప్టెన్సీ చేపట్టిన సంగతి తెలిసిందే.
సంబంధిత కథనం