భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అర్ధరాత్రి ఎక్స్లో పోస్ట్ చేసిన పోస్టుకి నెటిజన్లు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్పై జోరుగా చర్చ జరుగుతోంది. అతడ్ని వేలానికి వదిలేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ‘‘నేను ఐపీఎల్ వేలానికి వెళ్తే అమ్ముడుపోతానా? ఎంత ధరకి?’’ అని శుక్రవారం అర్ధరాత్రి ఫన్నీగా నెటిజన్లను అడిగాడు. ఈ పోస్ట్పై అభిమానులు చాలా ఫన్నీగా స్పందిస్తూ వింత సమాధానాలు ఇస్తున్నారు.
కొందరు రిషబ్ పంత్ రూ.18 కోట్లకి అమ్ముడుపోతాడని జోస్యం చెప్తుండగా.. మరికొందరు రూ.30 కోట్ల వరకు ధర పలుకుతావంటూ సమాధానం ఇస్తున్నారు. అయితే.. కొందరు మాత్రం అర్ధరాత్రి తాగేసి పోస్ట్ చేశావా? అంటూ చురకలు అంటిస్తున్నారు.
ఈ ఏడాది చివర్లో ఐపీఎల్ 2025 వేలం జరగనుండగా.. టోర్నీలోని 10 ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ 31లోగా బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు కూడా జోరుగా కసరత్తు చేస్తున్నాయి.
2022 చివర్లో కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ ఈ ఏడాది ఐపీఎల్తో మళ్లీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ.. ఢిల్లీ టీమ్ ప్రదర్శన ఆశాజనకంగా అనిపించలేదు. అయితే రిషబ్ పంత్ మాత్రం రీఎంట్రీ తర్వాత నిలకడగా ఆడుతున్నాడు.
ఇటీవల భారత్ జట్టు గెలిచిన టీ20 వరల్డ్కప్లోనూ రిషబ్ పంత్ సభ్యుడిగా ఉన్నాడు. అలానే బంగ్లాదేశ్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లోనూ పంత్ సత్తాచాటాడు. త్వరలోనే భారత్ జట్టు న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ను ఆడనుంది.
రిషబ్ పంత్ అర్ధరాత్రి పోస్ట్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ.. అతడ్ని వేలానికి వదిలేయబోతోందా? అనే సందేహాలు పెరిగాయి. రిషబ్ పంత్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ను వదిలేయాలని భావిస్తున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. అతను బెంగళూరు టీమ్లోకి వెళ్లాలని అనుకున్నట్లు కూడా రూమర్స్ వినిపించాయి.