ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఢిల్లీ బ్యాటర్ అశుతోష్ శర్మ 31 బంతుల్లోనేే 66 పరుగులతో (5 ఫోర్లు, 5 సిక్స్లు, నాకౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 210 పరుగుల ఛేజింగ్లో 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఢిల్లీ ఓటమి తథ్యమని ఓ దశలో అనిపించినా.. భీకర హిట్టింగ్తో అషుతోశ్ దుమ్మురేపాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకానొక గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)పై సోమవారం (మార్చి 24) జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. తన అద్భుత ఇన్నింగ్స్ను మెంటార్కు అంకితమిచ్చాడు అషుతోశ్. ఆ వివరాలివే..
గతేడాది పంజాబ్ కింగ్స్ జట్టుకు అశుతోష్ శర్మ ఆడాడు. కొన్ని మ్యాచ్ల్లో మెరుపు బ్యాటింగ్ చేశాడు. శిఖర్ ధావన్ సారథ్యంలో అదరగొట్టాడు. ఐపీఎల్ 2025 సీజన్ కోసం వేలంలో అషుతోశ్ను రూ.3.80కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. ఢిల్లీ తరఫున తొలి మ్యాచ్లోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు అశుతోష్ శర్మ.
లక్నోతో మ్యాచ్లో చెలరేగి ఆడిన డీసీ ప్లేయర్ అశుతోష్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీన్ని తన మెంటార్ శిఖర్ ధావన్కు అంకితమిచ్చాడు అశుతోష్. తనతో పాటు గెలుపులో కీలకపాత్ర పోషించిన విప్రాజ్ గురించి కూడా అతడు మాట్లాడాడు. “గతేడాది నుంచి పాఠాలు నేర్చుకున్నా. గత సీజన్లో రెండు సందర్భాల్లో ఫినిష్ చేయలేకపోయా. నేను చివరి వరకు ఆడితే ఏదైనా జరగొచ్చని నమ్మకంతో ఉన్నా. విప్రాజ్ చాలా బాగా ఆడాడు. హిట్టింగ్ చేస్తూనే ఉండాలని అతడితో చెప్పా. ఒత్తిడిలో చాలా ప్రశాంతంగా ఆడాడు. ఈ అవార్డును నా మెంటార్ శిఖర్ పాజీ (శిఖర్ ధావన్)కు అంకితమిస్తున్నా” అని అషుతోశ్ శర్మ చెప్పాడు.
పంజాబ్ కింగ్స్ తరఫున గతేడాది అషుతోశ్కు తుదిజట్టులో శిఖర్ ధావన్ చోటిచ్చాడు. గతేడాది ఫినిషల్ రోల్ వహించిన అతడు 189 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే అషుతోశ్ దుమ్మురేపగా.. ధావన్ను తన మెంటార్ అని చెప్పేశాడు.
డెస్సింగ్ రూమ్లోకి వెళ్లాక అషుతోశ్కు వీడియో కాల్ చేశాడు శిఖర్ ధావన్. అతడిని అభినందిస్తూ శిఖర్ మాట్లాడాడు. లవ్ యూ పాజీ అని అషుతోశ్ చెప్పాడు.
నిగమ్ విప్రాజ్ ఈ మ్యాచ్లో 15 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. ఆరంభంలో అశుతోష్ ఆచితూచి ఆడగా.. విప్రాజ్ దుమ్మురేపాడు. విప్రాజ్ ఔటయ్యాక ఆకాశమే హద్దుగా అశుతోష్ చెలరేగాడు. ఓ దశలో 20 బంతుల్లో 20 పరుగులే చేసిన అశుతోష్ ఆ తర్వాత ధనాధన్ హిట్టింగ్ చేశాడు. తన చివరి 11 బంతుల్లో ఏకంగా 46 పరుగులు చేసి.. జట్టును గెలిపించాడు. మూడు బంతులు మిగిలి ఉండగా.. ఓ వికెట్ తేడాతో ఢిల్లీ గెలిచింది. చివరి ఓవర్ మూడో బంతికి విన్నింగ్ సిక్స్ కొట్టాడు అశుతోష్ శర్మ.
సంబంధిత కథనం