Champions Trophy Team: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆదివారం (మార్చి9)తో ముగిసింది. దీంతో మరుసటి రోజే టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ను అనౌన్స్ చేసింది. ఇండియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్స్ మాత్రమే ఇందులో ఉన్నారు. ఇండియా నుంచి ఐదుగురు, న్యూజిలాండ్ నుంచి నలుగురు, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇద్దరు ప్లేయర్స్ కు చోటు దక్కడం విశేషం.
ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్లో భాగంగా మొత్తం 12 మందితో టీమ్ ను అనౌన్స్ చేశారు. అందులో తుది 11 మందిలోనే ఐదుగురు ఇండియన్స్ ఉండగా.. 12వ ప్లేయర్ గా కూడా ఇండియన్ అయిన అక్షర్ పటేల్ కు చోటు దక్కింది. అయితే ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇందులో లేడు.
టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన బ్యాటర్లు విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తోపాటు పేస్ బౌలర్ మహ్మద్ షమి, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ జట్టులో ఉన్నారు. మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 12వ ప్లేయర్ గా ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం ఛాన్స్ రాలేదు.
ఇక ఈ జట్టులో నలుగురు న్యూజిలాండ్ ప్లేయర్స్ కు చోటు దక్కడం విశేషం. వీళ్లలో ఓపెనర్, టోర్నీలో రెండు సెంచరీలు చేసిన రచిన్ రవీంద్ర ఒకరు. అతనితోపాటు టోర్నీలో తన కళ్లు చెదిరే ఫీల్డింగ్ తో అదరగొట్టిన గ్లెన్ ఫిలిప్స్, స్పిన్నర్ మిచెల్ సాంట్నర్, పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ ఉన్నారు. కెప్టెన్సీ మిచెల్ సాంట్నర్ కు దక్కడం విశేషం.
ఇక ఇండియా, న్యూజిలాండ్ కాకుండా ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఇద్దరు ప్లేయర్స్ టీమ్ లో ఉన్నారు. వీళ్లలో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధికంగా 177 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసిన ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్, మిడిలార్డర్ లో అజ్మతుల్లా ఒమర్జాయ్ లకు చోటు దక్కింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తంగా 8 జట్లు పాల్గొన్నా.. టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్లో కేవలం మూడు జట్లకే ప్రాతినిధ్యం దక్కింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లకు నిరాశే ఎదురైంది.
వీటిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీఫైనల్లో ఓడిపోగా.. మిగిలిన మూడు టీమ్స్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి. ఆఫ్ఘన్ కూడా లీడ్ స్టేజ్ లోనే వెళ్లిపోయినా.. ఆ జట్టు నుంచి ఇద్దరు ఇందులో చోటు దక్కించుకోవడం నిజంగా విశేషమే.
రచిన్ రవీంద్ర, ఇబ్రహీం జద్రాన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, గ్లెన్ ఫిలిప్స్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మిచెల్ సాంట్నర్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమి, మ్యాట్ హెన్రీ
12వ ప్లేయర్: అక్షర్ పటేల్
సంబంధిత కథనం