ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు తెరలేచింది. ఎన్నో అనుమానాలు, సవాళ్ల మధ్య ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం (ఫిబ్రవరి 19) డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ తో ఈ టోర్నీ ప్రారంభమైంది. కరాచీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ కు దిగింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగింది. చివరగా 2017లో జరిగిన టోర్నీలో ఆ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ పై విజయం సాధించింది. ఈ సారి సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పాక్ ఉంది. కెప్టెన్ రిజ్వాన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం, ఫకర్ జమాన్, షహీన్ షా అఫ్రిది, నసీం షా తదితర ఆటగాళ్లతో పాక్ బలంగానే ఉంది.
మరోవైపు న్యూజిలాండ్ సెన్సేషనల్ ఫామ్ లో ఉంది. ఇటీవల పాకిస్థాన్ లో జరిగిన ముక్కోణపు సిరీస్ లో ఆ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో పాక్ ను చిత్తుచేసింది. కెప్టెన్ శాంట్నర్, కీలక ప్లేయర్ కేన్ విలియమ్సన్, విల్ యంగ్, కాన్వే తదితర ఆటగాళ్లు కివీస్ కు బలం. అయితే మక్కోణపు సిరీస్ లో గాయపడ్డ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు.
సంబంధిత కథనం