ఓ వైపు బ్యాటర్ గా వరుస ఫెయిల్యూర్స్.. మరోవైపు కెప్టెన్ గా కలిసి రాని సీజన్.. ఇప్పటికే కష్టాలు ఎదుర్కొంటున్న రిషబ్ పంత్ కు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. ఈ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కు భారీ ఫైన్ విధించింది. ఐపీఎల్ లో రూల్స్ బ్రేక్ చేసినందుకు పంత్ పై ఈ ఫైన్ పడింది. రూ.24 లక్షల జరిమానా కట్టాల్సి వచ్చింది.
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్స్ పైనా బీసీసీఐ కొరడా ఝుళిపించింది. ఇంపాక్ట్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ సహా మిగిలిన ప్లేయింగ్ ఎలెవన్ ఆటగాళ్లకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఏది తక్కువైతే అది జరిమానాగా విధించారు.
కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం పంత్ కు సీజన్లో ఇది రెండో నేరం. దీంతో రూ.24 లక్షల జరిమానా విధించినట్లు బీసీసీఐ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి స్లో ఓవర్ రేట్ నేరానికి పాల్పడితే పంత్ పై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశముంది. రూ.90 లక్షల ఫైన్ తో పాటు డీమెరిట్ పాయింట్లు కూడా యాడ్ చేస్తారు. ఈ డీమెరిట్ పాయింట్లు లెక్క దాటితే ఓ మ్యాచ్ సస్పెన్షన్ పడుతుంది.
రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన రిషబ్ పంత్ బ్యాటింగ్ లో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఈ ఐపీఎల్ 2025లో 10 మ్యాచ్ ల్లో పంత్ 110 పరుగులు చేశాడు. ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో పంత్ 4 రన్స్ సాధించాడు. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన లక్నో 54 పరుగుల తేడాతో ఓడిపోయింది.
లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుతం పాయింట్ల టేబుల్ లో ఆరో స్థానంలో ఉంది. 10 మ్యాచ్ ల్లో అయిదు ఓడి, అయిదు గెలిచింది.
సంబంధిత కథనం