Babar Azam Fraud: కోహ్లీతో పోలుస్తారా? బాబర్ ఆజం ఓ మోసగాడు: లైవ్ టీవీలో పాక్ దిగ్గజ పేసర్ సెన్సేషనల్ కామెంట్స్-babar azam is a fraud legendary pacer shoaib akhtar sensational comments on live tv india vs pakistan champions trophy ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Babar Azam Fraud: కోహ్లీతో పోలుస్తారా? బాబర్ ఆజం ఓ మోసగాడు: లైవ్ టీవీలో పాక్ దిగ్గజ పేసర్ సెన్సేషనల్ కామెంట్స్

Babar Azam Fraud: కోహ్లీతో పోలుస్తారా? బాబర్ ఆజం ఓ మోసగాడు: లైవ్ టీవీలో పాక్ దిగ్గజ పేసర్ సెన్సేషనల్ కామెంట్స్

Babar Azam Fraud: పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ఓ మోసగాడు అని ఆ దేశ దిగ్గజ పేసర్ సెన్సేషనల్ కామెంట్లు చేశాడు. ఆదివారం (ఫిబ్రవరి 23) భారత్ తో మ్యాచ్ లో బాబర్ 26 బంతుల్లో 23 పరుగులు మాత్రమే చేశాడు.

భారత్ తో మ్యాచ్ లో వికెట్ కోల్పోయిన తర్వాత పెవిలియన్ వెళ్తున్న బాబర్ ఆజం (AP)

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పాకిస్థాన్ కు ఎంతో కీలకమైన భారత్ తో మ్యాచ్ లో అతను దారుణంగా విఫలమయ్యాడు. 23 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. దీంతో బాబర్ పై పాక్ పేస్ దిగ్గజం షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఓ మోసగాడు అని తీవ్రమైన కామెంట్లు చేశాడు.

కోహ్లీతో పోలుస్తారా?

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తో మ్యాచ్ లో విఫలమైన బాబర్ ఓ మోసగాడని లైవ్ టీవీ షోలో అక్తర్ ధ్వజమెత్తాడు. ‘‘మేమెప్పుడూ బాబర్ ను కోహ్లీతో పోలుస్తున్నాం. కానీ ఇప్పుడు చెప్పండి కోహ్లి హీరో ఎవరు? సచిన్ 100 సెంచరీలు చేశాడు. కోహ్లి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. మరి బాబర్ హీరో ఎవరో? టుక్ టుక్ (పేరు చెప్పలేదు). తప్పుడు హీరోలు. నీ ఆలోచించే విధానమే తప్పు. మొదటి నుంచి నువ్వు మోసగాడివే’’ అని బాబర్ ను ఉద్దేశిస్తూ అక్తర్ పేర్కొన్నాడు.

బాబర్ కింగ్ కాదు

పాక్ వెటరన్ ఆల్ రౌండర్ హఫీజ్ కూడా బాబర్ పై సంచలన విమర్శలు చేశాడు. ‘‘బాబర్ ఆజం ట్రూ కింగ్ కాదు. కోహ్లీనే అసలైన రాజు. అతని ప్రదర్శన చూడండి. ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. మరి భారత్ పై బాబర్ ఆజం ప్రదర్శన గురించి చెప్పండి. అతనేమీ ఇంజమాముల్ హక్ కాదు. కఠిన పరిస్థితుల్లో ఇంజీ భాయ్ పాకిస్థాన్ ను గెలిపించాడు. కానీ బాబర్ అలా కాదు. అందుకే అతణ్ని వదిలేసి కొత్త ఆటగాళ్లకు అవకాశాలివ్వాలి’’ అని హఫీజ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

పాక్ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాక్ త్వరగానే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. గ్రూప్-ఎ లో న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఆ జట్టు ఓడింది. సోమవారం (ఫిబ్రవరి 24) బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ గెలిస్తే పాక్ ఇంటికే. కివీస్, భారత్ సెమీస్ చేరతాయి. ఈ టోర్నీలో తమ జట్టుకు ఇక అవకాశం లేదని పాక్ కెప్టెన్ రిజ్వాన్ కూడా ఇప్పటికే నిరాశ వ్యక్తం చేశాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం