పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పాకిస్థాన్ కు ఎంతో కీలకమైన భారత్ తో మ్యాచ్ లో అతను దారుణంగా విఫలమయ్యాడు. 23 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. దీంతో బాబర్ పై పాక్ పేస్ దిగ్గజం షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఓ మోసగాడు అని తీవ్రమైన కామెంట్లు చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తో మ్యాచ్ లో విఫలమైన బాబర్ ఓ మోసగాడని లైవ్ టీవీ షోలో అక్తర్ ధ్వజమెత్తాడు. ‘‘మేమెప్పుడూ బాబర్ ను కోహ్లీతో పోలుస్తున్నాం. కానీ ఇప్పుడు చెప్పండి కోహ్లి హీరో ఎవరు? సచిన్ 100 సెంచరీలు చేశాడు. కోహ్లి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. మరి బాబర్ హీరో ఎవరో? టుక్ టుక్ (పేరు చెప్పలేదు). తప్పుడు హీరోలు. నీ ఆలోచించే విధానమే తప్పు. మొదటి నుంచి నువ్వు మోసగాడివే’’ అని బాబర్ ను ఉద్దేశిస్తూ అక్తర్ పేర్కొన్నాడు.
పాక్ వెటరన్ ఆల్ రౌండర్ హఫీజ్ కూడా బాబర్ పై సంచలన విమర్శలు చేశాడు. ‘‘బాబర్ ఆజం ట్రూ కింగ్ కాదు. కోహ్లీనే అసలైన రాజు. అతని ప్రదర్శన చూడండి. ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. మరి భారత్ పై బాబర్ ఆజం ప్రదర్శన గురించి చెప్పండి. అతనేమీ ఇంజమాముల్ హక్ కాదు. కఠిన పరిస్థితుల్లో ఇంజీ భాయ్ పాకిస్థాన్ ను గెలిపించాడు. కానీ బాబర్ అలా కాదు. అందుకే అతణ్ని వదిలేసి కొత్త ఆటగాళ్లకు అవకాశాలివ్వాలి’’ అని హఫీజ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాక్ త్వరగానే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. గ్రూప్-ఎ లో న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఆ జట్టు ఓడింది. సోమవారం (ఫిబ్రవరి 24) బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ గెలిస్తే పాక్ ఇంటికే. కివీస్, భారత్ సెమీస్ చేరతాయి. ఈ టోర్నీలో తమ జట్టుకు ఇక అవకాశం లేదని పాక్ కెప్టెన్ రిజ్వాన్ కూడా ఇప్పటికే నిరాశ వ్యక్తం చేశాడు.
సంబంధిత కథనం