లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 18 బంతుల్లో 25 రన్స్ చేస్తే గెలుస్తుంది.. క్రీజులో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ ఉన్నారు. ఆ టీమ్ గెలుపు నల్లేరు మీద నడకే అనిపించింది. కానీ అప్పుడే అవేశ్ ఖాన్ అద్భుతం చేశాడు. 18వ ఓవర్లో యశస్వి, పరాగ్ వికెట్లు తీశాడు. లాస్ట్ ఓవర్లో 9 పరుగులు కావాల్సి ఉండగా.. హెట్ మయర్ ను ఔట్ చేసి 6 పరుగులే ఇచ్చి లక్నో కు సంచలన విజయాన్ని అందించాడు.
శనివారం (ఏప్రిల్ 19) జైపూర్ లో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో రాజస్థాన్ పై లక్నో 2 పరుగుల తేడాతో గెలిచింది. 181 పరుగుల ఛేజింగ్ లో రాజస్థాన్ 178/5 రన్స్ మాత్రమే చేసింది. యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 74; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాటానికి ఫలితం దక్కలేదు.
ఐపీఎల్ అరంగేట్రంతోనే హిస్టరీ క్రియేట్ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ తో కేకే పెట్టించాడు. ఐపీఎల్ డెబ్యూ చేసిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచిన ఈ పిల్లాడు.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆడిన ఫస్ట్ బాల్ నే అద్భుతమైన సిక్సర్ గా మలిచాడు. శార్దూల్ బౌలింగ్ లో కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. ఏ మాత్రం బెరుకులేకుండా టాప్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు.
అవేశ్ ఖాన్ బౌలింగ్ లో ఓ బంతిని స్టాండ్స్ లో పడేశాడు వైభవ్. బాల్ ను గ్రౌండ్ మీద నుంచి పంపించడం కంటే గాల్లోకి లేపేందుకే వైభవ్ ప్రయత్నించాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా రెచ్చిపోయాడు. మార్క్రమ్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు జైస్వాల్. పవర్ ప్లేలో 61/0తో నిలిచిన రాజస్థాన్ గెలుపు దిశగా సాగింది.
యశస్వి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. కానీ వెంటనే వైభవ్ స్టంపౌటయ్యాడు. మార్క్రమ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. వైభవ్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. 14 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు.
ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ నితీశ్ రాణా కూడా త్వరగానే ఔటయ్యాడు. అయినా కెప్టెన్ రియాన్ పరాగ్ (39) తో కలిసి జైస్వాల్ జోరు కొనసాగించాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాదాడు. మరో ఎండ్ లో పరాగ్ కూడా నెమ్మదిగా స్పీడ్ అందుకున్నాడు. అవేశ్ బౌలింగ్ లో పరాగ్ సిక్సర్, జైస్వాల్ ఫోర్ కొట్టడంతో 13 రన్స్ వచ్చాయి. సమీకరణం 24 బంతుల్లో 33 పరుగులుగా మారింది.
రాజస్థాన్ రాయల్స్ ఛేజింగ్ లో చివర్లో డ్రామా నెలకొంది. అవేశ్ ఖాన్ 18వ ఓవర్లో జైస్వాల్ తో పాటు పరాగ్ ను ఔట్ చేయడంతో ఉత్కంఠ రేగింది. రాజస్థాన్ గెలవాలంటే 12 బంతుల్లో 20 పరుగులు చేయాలి. ప్రిన్స్ యాదవ్ వేసిన 19వ ఓవర్లో హెట్ మయర్ రెండు ఫోర్లు కొట్టడంతో మొత్తం 11 రన్స్ వచ్చాయి.
లాస్ట్ ఓవర్లో 9 రన్స్ కావాల్సి వచ్చింది. అవేశ్ వేసిన ఆ ఓవర్ తొలి రెండు బాల్స్ లో 3 రన్స్ వచ్చాయి. మూడో బాల్ కు హెట్ మయర్ ఔటవడంతో టెన్షన్ మరింత పెరిగింది. నాలుగో బాల్ కు ఒక్క పరుగూ రాలేదు. 2 బంతుల్లో 6 పరుగులు కావాలి. క్రీజులో ఉన్న శుభమ్ దూబె అయిదో బంతిని గాల్లోకి లేపాడు. కానీ మిల్లర్ క్యాచ్ వదిలేయడంతో రెండు పరుగులు వచ్చాయి. లాస్ట్ బాల్ కు ఫోర్ కొడితే రాజస్థాన్ విన్ అవుతుంది. కానీ శుభమ్ ఒకటే పరుగు చేయగలిగాడు.
అంతకుముందు ఐపీఎల్ 2025లో రాజస్థాన్ తో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ మంచి స్కోరే సాధించింది. 20 ఓవర్లలో ఆ టీమ్ 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. మార్క్రమ్ (45 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆయూష్ బదోని (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, ఓ సిక్సర్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.
ఆఖర్లో అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్; 4 సిక్సర్లు) అదరగొట్టాడు. ఢిల్లీ బౌలర్లలో హసరంగ రెండు వికెట్లు పడగొట్టాడు.
సంబంధిత కథనం