IND vs AUS 5th T20: ఆస్ట్రేలియాదే టాస్.. జట్టులో ఓ మార్పు చేసిన భారత్.. మెడికల్ ఎమర్జెన్సీతో అతడు దూరం
IND vs AUS 5th T20: ఆస్ట్రేలియాతో టీమిండియా చివరి టీ20 ప్రారంభమైంది. మరోసారి భారత్ టాస్ ఓడిపోయింది.
IND vs AUS 5th T20: భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 షురూ అయింది. ఐదు టీ20ల సిరీస్లో ఇరు జట్ల మధ్య ఆఖరి పోరు మొదలైంది. 3-1తో ఇప్పటికే సిరీస్ను పక్కా చేసుకున్న భారత్.. ఈ ఐదో టీ20లోనూ గెలిచి ఘనంగా ముగించాలని పట్టుదలతో ఉంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో నేడు (డిసెంబర్ 3) టీమిండియా, ఆసీస్ మధ్య ఐదో టీ20 జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకుంది.
గత మ్యాచ్తో పోలిస్తే టీమిండియా, ఆస్ట్రేలియా తుదిజట్లలో చెరో మార్పు చేశాయి. దీపక్ చాహర్ స్థానంలో అర్షదీప్ సింగ్ తిరిగి భారత తుదిజట్టులోకి వచ్చాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా చాహర్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. గ్రీన్ స్థానంలో నాథన్ ఎలిస్ను ఆస్ట్రేలియా తుదిజట్టులోకి తీసుకుంది.
వరుసగా టాస్లు ఓడిపోతుండడంపై కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. మ్యాచ్లు గెలుస్తున్నంతసేపు టాస్ ఓడినా పట్టించుకోబోమని చెప్పాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా దీపక్ చాహర్ ఇంటికి వెళ్లడంతో అర్షదీప్ సింగ్ జట్టులోకి వచ్చాడని సూర్య తెలిపాడు.
భారత తుదిజట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్
ఆస్ట్రేలియా తుదిజట్టు: ట్రావిస్ హెడ్, జోష్ ఫిలిప్, బెన్ మెక్డెర్మోట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), బెన్ డార్షుస్, నాథన్ ఎలిస్, జేసన్ బెహరండాఫ్, తన్వీర్ సంఘా
ఈ ఐదు టీ20ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠ మధ్య జరిగిన మూడో టీ20లో ఆసీస్ గెలిచింది. అయితే, శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో గెలిచిన భారత్.. ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను పక్కా చేసుకుంది. నేటి ఐదో మ్యాచ్ గెలిచి 4-1తో సిరీస్ను ఘనంగా ముగించాలని టీమిండియా కసిగా ఉంది.