Asia Cup in India: 34 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగి రానున్న ఆసియా కప్.. వచ్చే ఏడాది మన దగ్గరే టోర్నీ-asia cup 2025 in india in t20 format asian cricket council revealed team india bcci cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Asia Cup In India: 34 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగి రానున్న ఆసియా కప్.. వచ్చే ఏడాది మన దగ్గరే టోర్నీ

Asia Cup in India: 34 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగి రానున్న ఆసియా కప్.. వచ్చే ఏడాది మన దగ్గరే టోర్నీ

Hari Prasad S HT Telugu

Asia Cup in India: ఆసియా కప్ 34 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియాకు తిరిగి వస్తోంది. వచ్చే ఏడాది ఈ మెగా టోర్నీకి ఇండియానే ఆతిథ్యమివ్వబోతుండటం విశేషం. 40 ఏళ్లలో ఇండియా కేవలం రెండోసారి మాత్రమే ఇండియా ఆతిథ్యమిస్తోంది.

34 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగి రానున్న ఆసియా కప్.. వచ్చే ఏడాది మన దగ్గరే టోర్నీ

Asia Cup in India: క్రికెట్ లో ఆసియా దేశాల హవా ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయితే ఆ ఆసియా దేశాల్లో ఎవరు ఛాంపియన్ అని తేల్చేదే ఆసియా కప్. 1984లో తొలిసారి జరిగిన ఈ మెగా టోర్నీ 34 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియాలో జరగనుంది. వచ్చే ఏడాది ఈ టోర్నీ ఆతిథ్య హక్కులను ఇండియాకు ఇస్తున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది.

వచ్చే ఏడాది ఆసియా కప్ ఇండియాలో..

ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ సోమవారం (జులై 29) ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ఇన్విటేషన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం 2025లో జరగబోయే ఆసియా కప్ కు ఇండియా ఆతిథ్యం ఇస్తోంది. ఇది టీ20 ఫార్మాట్లో జరగనున్న టోర్నీ. ఇక 2027లో వన్డే ఫార్మాట్లో జరగబోయే ఆసియా కప్ ను మరోసారి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. ఇండియా చివరిసారి 1990-91లో ఆసియా కప్ నిర్వహించింది.

ఇప్పటి వరకూ ఇండియా ఆతిథ్యమిచ్చిన ఏకైన ఆసియా కప్ అదే. మొత్తానికి ఇప్పుడు 34 ఏళ్ల తర్వాత 2025లో మరోసారి టోర్నీని హోస్ట్ చేయబోతోంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు టీమ్స్ పాల్గొననుండగా.. 13 మ్యాచ్ లు జరుగుతాయి. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ కన్ఫమ్ కాగా.. మరో టీమ్ ఏదో అర్హత టోర్నీ ద్వారా తేలనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఈ టోర్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి.

వచ్చే ఏడాది టీమిండియా షెడ్యూల్

ఈ ఏడాది సెకండాఫ్ తోపాటు వచ్చే ఏడాది కూడా టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. 2025లో జనవరి, ఫిబ్రవరిల్లోనే ఇంగ్లండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ లో ఇండియన్ టీమ్ ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి-మార్చిలలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ఇక ఆ వెంటనే ఐపీఎల్.. ఆ తర్వాత జూన్ నుంచి ఆగస్ట్ మధ్య ఇంగ్లండ్ పర్యటన ఉంటుంది.

ఈ టూర్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ వెళ్లి అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. ఈ సిరీస్ తర్వాతే ఏషియా కప్ జరిగే అవకాశం ఉంది. అది ముగియగానే అక్టోబర్ లో వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ ఉంటుంది. ఆసియా కప్ ఇండియాలోనే జరగనున్నా దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటనతోపాటు వేదికలపైనా ప్రకటన రావాల్సి ఉంది.

2022, 2023లలో ఆసియా కప్ జరిగింది. 2022లో టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీని శ్రీలంక గెలవగా.. గతేడాది వన్డే వరల్డ్ కప్ ముందు జరిగిన ఆసియా కప్ ను ఇండియా గెలుచుకుంది. ఫైనల్లో శ్రీలంకను 10 వికెట్లతో ఓడించింది.

ఆసియా కప్ ఆతిథ్య దేశాలు

ఆసియా కప్ 1984లో మొదలైంది. తొలి టోర్నీకి యూఏఈ ఆతిథ్యమిచ్చింది. 1986లో శ్రీలంక, 1988లో బంగ్లాదేశ్, 1990-91లలో ఇండియా, 1995లో యూఏఈ, 1997లో శ్రీలంక, 2000లో బంగ్లాదేశ్, 2004లో శ్రీలంక, 2008లో పాకిస్థాన్, 2010లో శ్రీలంక, 2012, 2014, 2016లలో బంగ్లాదేశ్, 2018, 2022లో యూఏఈ, 2023లో పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యమిచ్చాయి. అత్యధికంగా ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ ఐదుసార్లు ఆసియా కప్ నిర్వహించింది.