వారెవా వైభవ్.. బ్యాటింగ్ అరాచకం.. 14 ఏళ్లకే రికార్డు సెంచరీ.. గుజరాత్ పై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ-14 years old vaibhav suryavanshi historic hundred get 8 wickets win for rajasthan royals vs gujarat titans yashaswi ipl ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  వారెవా వైభవ్.. బ్యాటింగ్ అరాచకం.. 14 ఏళ్లకే రికార్డు సెంచరీ.. గుజరాత్ పై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ

వారెవా వైభవ్.. బ్యాటింగ్ అరాచకం.. 14 ఏళ్లకే రికార్డు సెంచరీ.. గుజరాత్ పై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ

ఏమా బ్యాటింగ్.. ఏమా విధ్వంసం.. 14 ఏళ్లకే ఐపీఎల్ లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. యంగెస్ట్ సెంచూరియన్.. గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఊచకోతతో రికార్డులు బద్దలయ్యాయి. రాజస్థాన్ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

సెంచరీ తర్వాత అభివాదం చేస్తున్న వైభవ్ సూర్యవంశీ (AFP)

కొన్ని బ్యాటింగ్ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతాయి. కొన్ని మాత్రం చరిత్రకే కారణమవుతాయి. సోమవారం (ఏప్రిల్ 28) జైపూర్ లో జరిగిందదే. ఓ అద్భుతం ఆవిష్క్రతమైంది. ఆ అద్భుతం పేరు వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల ఈ పిల్లాడు మాటలకు అందని విధంగా భారీ షాట్లతో చెలరేగుతుంటే క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది.

14 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడటమే కాదు సెన్సేషనల్ సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 101; 7 ఫోర్లు, 11 సిక్సర్లు) నిజంగానే ఓ అద్భుతం. అతనితో పాటు యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 70; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ ను రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. 210 టార్గెట్ ను 15.5 ఓవర్లలోనే రీచ్ అయింది. ఈ గెలుపుతో ఐపీఎల్ 2025లో రాజస్థాన్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలిచాయి.

డూ ఆర్ డై

210 ఛేజింగ్.. ఓడిపోతే ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసుకు దూరమయ్యే పరిస్థితి. ఆ సిచ్యువేషన్ లో వైభవ్ సూర్యవంశీ పిడుగుల్లే పడ్డాడు. గుజరాత్ టైటాన్స్ ను వణికించాడు. పరుగుల సునామీతో ప్రత్యర్థిని ముంచెత్తాడు. ఒకటే బాదుడు. అయితే సిక్సర్ లేదంటే ఫోర్. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే సిరాజ్ బౌలింగ్ లో సిక్సర్ తో వైభవ్ ఊచకోత మొదలైంది.

ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. ఏమా బ్యాటింగ్. ఏమా షాట్లు. 14 ఏళ్ల అబ్బాయి ఇలా బ్యాటింగ్ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. కచ్చితమైన టైమింగ్ తో, మంచి క్లాస్ తో షాట్లు కొట్టాడు వైభవ్. వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఓవర్లో వైభవ్ 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు.

బౌలర్ ఎవరైనా

బౌలర్ ఎవరన్నది తేడా లేదు.. పేస్, స్పిన్ అనే లెక్క లేదు వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపించడమే టార్గెట్ గా సూర్యవంశీ బ్యాటింగ్ చేశాడు. 17 బాల్స్ లోనే ఫిఫ్టీ బాదాడు. ఐపీఎల్ డెబ్యూ బౌలర్ కరీం జనత్ ఓవర్లో అయితే సూర్యవంశీ వరుసగా 6, 4, 6, 4, 4, 6 బాదాడు.

సిక్సర్ తో 35 బాల్స్ లోనే సూర్యవంశీ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. ఆ తర్వాత సూర్యవంశీ ఔటయ్యాడు. అతను పెవిలియన్ వెళ్తుంటే స్టేడియం మొత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది.

జైస్వాల్ అదుర్స్

ఈ సూపర్ ఛేజింగ్ లో సూర్యవంశీ అమేజింగ్ ఇన్నింగ్స్ తో యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ కనిపించలేదు. కానీ జైస్వాల్ కీలక పరుగులు చేశాడు. టకటకా రెండు వికెట్లు పడ్డా.. కెప్టెన్ రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జైస్వాల్ కలిసి మ్యాచ్ ముగించారు.

గిల్, బట్లర్ మెరుపులు

అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 209/4 భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తాచాటారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం