తెలంగాణ పాలిసెట్ 2025 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి..? ఎక్కడ చెక్ చేసుకోవాలి..? ఇవిగో అప్డేట్స్-when will the tg polycet 2025 results be out how to check the rank card ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ పాలిసెట్ 2025 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి..? ఎక్కడ చెక్ చేసుకోవాలి..? ఇవిగో అప్డేట్స్

తెలంగాణ పాలిసెట్ 2025 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి..? ఎక్కడ చెక్ చేసుకోవాలి..? ఇవిగో అప్డేట్స్

టీజీ పాలిసెట్ - 2025 ఫలితాలు త్వరలోనే విడుదలవుతాయి. మే 13వ తేదీన ఎగ్జామ్ పూర్తి కాగా… ఆ వెంటనే ప్రాథమిక కీ అందుబాటులోకి వస్తుంది. ఇక తుది ఫలితాలను పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత ప్రకటిస్తారు.

తెలంగాణ పాలిసెట్ - 2025 రిజల్ట్స్ (image source istock)

తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇవాళ (మే 13) రాష్ట్రవ్యాప్తంగా 276 కేంద్రాల్లో ఎగ్జామ్ పూర్తి కానుంది. ఈ ఏడాది 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత పొందిన వారు… పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని ఇంజనీరింగ్‌, నాన్ ఇంజనీరింగ్‌, టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతారు.

టీజీ పాలిసెట్ 2025 ఫలితాలు ఎప్పుడు..?

త్వరలోనే తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు విడుదలవుతాయి. అధికారుల ప్రకటించిన వివరాల ప్రకారం… పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. దీని ప్రకారం మే 13వ తేదీన పరీక్ష జరగగా… మే 24వ తేదీ తర్వాత రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

టీజీ పాలిసెట్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి..?

  • పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ https://www.polycet.sbtet.telangana.gov.in/ పై క్లిక్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయాలి.
  • మీ లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  • ఇక్కడ ర్యాంక్‌ కార్డు స్క్రీన్‌పై డిస్‌ ప్లే అవుతుంది.
  • ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
  • అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.

తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు విడుదలైన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో మొత్తం కన్వీనర్ కోటా సీట్లే ఉంటాయి. ఇందులో 85 శాతం స్థానికులకు మిగిలిన 15 శాతం సీట్లను స్థానికేతర కోటా కింద కేటాయిస్తారు. 4 నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే లోకల్(స్థానికం)గా పరిగణిస్తారు. విడతల వారీగా సీట్ల భర్తీ ఉంటుంది. సీట్లు మిగిలే స్పాట్ అడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవుతాయి. పూర్తి వివరాలను సాంకేతిక విద్యా మండలి ప్రకటిస్తుంది.

గతేడాది చూస్తే మే 24న తెలంగాణ పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు హాజరుకాగా.. 84.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను జూన్ 3వ తేదీన వెల్లడించారు. ఈసారి మే 13వ తేదీన ఎగ్జామ్ నిర్వహించగా…మే 24వ తేదీ లేదా ఆలోపే ప్రకటించే అవకాశం ఉంటుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.