TG EAPCET Results 2025 : టీజీ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు ఎప్పుడు వస్తాయి..? ఎలా చెక్ చేసుకోవాలి..?-when will tg eapcet 2025 results be declared how to check the results ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Eapcet Results 2025 : టీజీ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు ఎప్పుడు వస్తాయి..? ఎలా చెక్ చేసుకోవాలి..?

TG EAPCET Results 2025 : టీజీ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు ఎప్పుడు వస్తాయి..? ఎలా చెక్ చేసుకోవాలి..?

టీజీ ఈఏపీసెట్-2025 (ఎంసెట్) పరీక్షలు ముగిశాయి. అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ స్ట్రీమ్ లలో జరిగిన పరీక్షలకు సుమారు 93 శాతానికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.ఇప్పటికే ప్రిలిమినరీ కీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే తుది ఫలితాలను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

టీజీ ఈఏపీసెట్ ఫలితాలు 2025

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలు ముగిశాయి. ముందుగా అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు పూర్తికాగా… ఆ వెంటనే ప్రిలిమినరీ కీలతో పాటు రెస్పాన్స్ షీట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యంతరాలను కూడా స్వీకరించారు. మరోవైపు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్ పూర్తి కాగానే… ప్రాథమిక కీలతో పాటు రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి.

టీజీ ఈఏపీసెట్ 2025 ఫలితాలు ఎప్పుడు..?

ఏప్రిల్ 29 నుంచి మే 4, 2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షల కీలపై అభ్యంతరాల ప్రక్రియ పూర్తిగా.. ప్రస్తుతం ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మే 7వ తేదీ సాయంత్రం 05:00 గంటలలోపు పూర్తవుతుంది.

అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తి కాగానే…. వెంటనే మూల్యాంకన ప్రక్రియను చేపడుతారు. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. సాంకేతిక అంశాలన్నింటని పరిశీలించిన తర్వాత… ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈసారి మే 15వ తేదీలోపు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ఈ ఏడాది కూడా జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలోనే ఈఏపీసెట్ పరీక్షలను నిర్వహించారు. గతేడాది చూస్తే మే 7వ తేదీన ఈఏపీసెట్ పరీక్షలు ప్రారంభం కాగా… 11వ తేదీతో ముగిశాయి. ఆ వెంటనే మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారు. మే 18వ తేదీన తుది ఫలితాలను ప్రకటించారు. ఈసారి మే 4వ తేదీనే పరీక్షలు పూర్తికాగా…తొందర్లోనే ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని కుదిరితే మే 15వ తేదీ లేదా ఆ లోపే ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై జేఎన్టీయూ హైదరాబాద్ అధికారికంగా ప్రకటన చేస్తుంది.

టీజీ ఈఏపీసెట్ 2025 రిజల్ట్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి..?

తెలంగాణ ఈఏపీసెట్-2025 ఫలితాలు ప్రకటించిన తర్వాత eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి సాధించిన మార్కులతో పాటు ర్యాంకులు అందుబాటులో ఉంటాయి. ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి…

  1. టీజీ ఈఏపీసెట్-2025 పరీక్షలు రాసిన అభ్యర్థులు https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
  2. టీజీ ఈఏపీసెట్ రిజల్ట్స్- 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  4. ఇక్కడ మీ ర్యాంక్(స్కోర్) డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
  6. ఈఏపీసెట్ అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తగా ఉంచుకోవాలి.

టీజీ ఈఏపీసెట్-2025 ఆధారంగా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ర్యాంక్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఫలితాలను ప్రకటించిన తర్వాత…కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. వీటి ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

గతేడాది ఫలితాలను చూస్తే…. ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో ఉత్తీర్ణత శాతం 74.98గా ఉంది.ఇందులోనూ అబ్బాయిలు 74.38 శాతం,అమ్మాయిలు 75.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లో చూస్తే అబ్బాయిలు 88.25 శాతం, అమ్మాయిలు 90.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 89.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం