లక్నో: నీట్ (NEET) యూజీ పరీక్షలు, ఇతర పరీక్షల్లో పాస్ చేయిస్తామంటూ డబ్బుల వసూళ్లకు దిగిన ముఠాను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఛేదించింది. నోయిడాలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది. పరీక్షలో పాస్ చేయడానికి అభ్యర్థుల బంధువుల నుండి ఈ ముఠా డబ్బు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మే 4న జరిగిన నీట్ యూజీ పరీక్షలో ఉత్తీర్ణులను చేసేందుకు కొంతమంది వ్యక్తులు అభ్యర్థుల బంధువుల నుండి డబ్బు డిమాండ్ చేస్తున్నారని STF నోయిడా బృందానికి మే 3న సమాచారం అందింది. ఈ ముఠా కార్యాలయం పోలీస్ స్టేషన్ ఫేజ్-1 పరిధిలోని సెక్టార్-3, నోయిడాలో ఉంది.
ఈ సమాచారం ఆధారంగా, STF నోయిడా బృందం వెంటనే అక్కడికి చేరుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వారిని విక్రమ్ కుమార్ సాహ్, ధర్మపాల్ సింగ్, అనికేత్ కుమార్గా గుర్తించారు.
ఆదివారం విద్యా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, భారతదేశంలోని 548 నగరాలు మరియు 14 అంతర్జాతీయ కేంద్రాలలో జరిగిన నీట్ యూజీ 2025 పరీక్షకు 20.8 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా పరీక్ష ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా జరిగిందని, ఎటువంటి అవకతవకలు జరిగినట్లు నివేదికలు అందలేదని వర్గాలు తెలిపాయి. "20.8 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎటువంటి సందేహం లేదు - ఇది సజావుగా జరిగింది" అని ఒక అధికారి తెలిపారు. ఆలస్యంగా రావడం, దుస్తుల నియమావళిపై కొంత గందరగోళం వంటి చిన్న సమస్యలు మాత్రమే ఎదురయ్యాయి. "ఇప్పటివరకు ఎటువంటి ఉల్లంఘనలు లేదా అక్రమ మార్గాల వినియోగం రిపోర్ట్ కాలేదు" అని ఆ వర్గాలు ధృవీకరించాయి.