టీటీడీ వేద పాఠశాలలో ప్రవేశాలకు 2025 -26 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.
టీటీడీ ఆధ్వర్యంలో నడుపుతున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములు (పాఠశాలలు) 1. వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల 2. కీసరగుట్ట, 3. విజయనగరం, 4. ఐ. భీమవరం, 5. నల్గొండ, 6. కోటప్పకొండలో నిర్వహించే వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన బాలుర నుంచి అనగా వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి, నిర్ణీత వయస్సు, విద్యా ప్రమాణాలు కలిగిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఆయా పాఠశాలల్లో బోధించబడే పలు కోర్సుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర వివరాలకు టీటీడీ అధికారిక వెబ్ సైట్ www.tirumala.org ని సందర్శించాలని టీటీడీ తెలిపింది.
మరోవైపు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.ఈ గడువు మే 31వ తేదీ వరకు ఉంది.అర్హత గల విద్యార్థులు admission.tirumala.org వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం… వారి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాలలో సీటు తాత్కాలికంగా ఆన్ లైన్ లో కేటాయిస్తారు. ఆపై విద్యార్థులకు ఎస్ఎమ్ఎస్ పంపుతారు. సీటు పొందిన విద్యార్థి ధృవీకరణ పత్రాలను అధికారులు వారి సిస్టమ్ లోకి అప్ లోడ్ చేస్తారు. విద్యార్థి ధృవీకరణ పత్రాలలోని వివరాలు సరిగాలేకున్నా, ఆన్ లైన్ లో సరిపోల్చకున్నా (టాలీకాకున్న) సీటు రద్దు కావడంతోపాటు సిస్టమ్ నుండి ఆటోమేటిక్ గా సదరు దరఖాస్తు రద్దవుతుంది.
విద్యార్థులు గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. గడువు ముగిశాక సవరణలకు అవకాశం ఉండదు. అందువల్ల విద్యార్థులు స్టూడెంట్ యూజర్ మాన్యువల్ను, కళాశాల ప్రాస్పెక్టస్ను పూర్తిగా చదివి ఆన్ లైన్ లో జాగ్రత్తగా దరఖాస్తు చేయాలని టీటీడీ ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.
సంబంధిత కథనం