118 అసిస్సెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు టీఎస్ఎల్పీఆర్బీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించింది. అయితే తాజాగా ఈ చివరి తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వరుసగా సెలవులు రావడం, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తులను పొడిగించారు. అక్టోబర్ 11వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తులను (సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయడంతో పాటు) త్వరగా పూరించడం, సమర్పించడం వేగవంతం చేయాలని టీఎస్ఎల్పీఆర్బీ సూచించింది. పొడిగించిన గడువుకు ముందుగానే దరఖాస్తులు సమర్పిస్తే చివరి నిమిషంలో సమస్యలు రాకుండా ఉంటాయని పేర్కొంది.
తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి దరఖాస్తులు మెుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ క్రిమినల్ కోర్టుల్లో మూడేళ్లకు పైగా ప్రాక్టీస్ చేసిన న్యాయవాదులు ఈ పోస్టులకు అర్హులని టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. దరఖాస్తు చేసుకునేముందు నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవాలని టీఎస్ఎల్పీఆర్బీ ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు గతంలో తెలిపారు. లిగల్ అడ్వైజరీలు, లీగల్ కౌన్సిలర్లు, లా ఆఫీసర్లువంటి వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటుగా ఎల్ఎల్బీ/బీఎల్ చేసి ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ఉండాలి. అభ్యర్థులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. వయసు విషయానికి వస్తే.. 2025 జూలై 1 నాటికి 34 సంవత్సరాలు మించకూడదు. రాత పరీక్ష ఉంటుంది. జీతం నెలకు రూ.54,220 నుంచి 1,33,630 వరకు ఉంటుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు www.tgprb.in లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000, ఇతరులకు రూ.2 వేలుగా నిర్ణయించారు.
టీజీ ప్రాసిక్యూషన్ సర్వీస్ విభాగంలో పని చేయడానికి టీఎస్ఎల్పీఆర్బీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టుల భర్తీకి ఆగస్టులో ప్రకటన విడుదల చేసింది. మెుత్తం 118 పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీజోన్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 38, లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద 12 పోస్టులు ఉన్నాయి. ఇక మల్టీజోన్ 2లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 57, లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద 11 పోస్టులు ఉన్నాయి.