టీఎస్ ఆర్జేసీ సెట్ - 2025 హాల్ టికెట్లు వచ్చేశాయ్. ఈ ఎంట్రెన్స్ ఆధారంగా రాష్ట్రంలోని గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పిస్తారు. 2025 - 26 విద్యా సంవత్సరానికి గాను సీట్లు కేటాయి స్తారు. ఈ రాత పరీక్ష మే 10వ తేదీన నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసున్న అభ్యర్థులు tgrjc.cgg.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.
పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తికావటంతో… హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
రాష్ట్రంలో మొత్తం 35 టీఎస్ఆర్జేసీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 15 బాలురు, 20 బాలికల కాలేజీలు. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. దాదాపు 3 వేల వరకు సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది.
టీఎస్ఆర్జేసీ - 2025 ప్రవేశపరీక్షను మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంచుకున్న కోర్సు ఆధారంగా సబ్జెక్ట్ ప్రశ్నలు అడుగుతారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్,బైపీసీ విద్యార్థులకు బయోలజీ, ఫిజిక్స్, ఇంగ్లీష్, ఎంఈసీ విద్యార్థులు ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్లో ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రవేశ పరీక్షను హైదరాబాద్ , రంగారెడ్డితో పాటు మరికొన్ని జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఈ వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.