తెలంగాణ టెట్ - 2025 పరీక్షల (జూన్ సెషన్) ఫలితాలు వచ్చేశాయ్. విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ విధంగానే ఇవాళ రిజల్ట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు 16 సెషన్లలో టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా…. 47,224 మంది(74.65 శాతం) హాజరయ్యారు. అలాగే పేపర్ 2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 66,686 మందికి గానూ 48,998 మంది(73.48) హాజరయ్యారు. పేపర్ 2(సోషల్ స్టడీస్)కు 53,706 మందికి దరఖాస్తు చేసుకోగా…. 41,207 మంది(76.73 శాతం) మంది హాజరయ్యారు.
పేపర్ - 1 కు హాజరైన అభ్యర్థుల్లో 61. 50 (29043 మంది) శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక పేపర్ లోని మ్యాథ్స్,సైన్స్ విభాగంలో 35.87 శాతం(17574 మంది), సోషల్ స్టడీస్ విభాగంలో 31.73 శాతం(13075 మంది) పాస్ అయ్యారు. మొత్తంగా ఈసారి జరిగిన టెట్ పరీక్షలో 33.98 శాతం (30649 మంది) ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ ప్రకటించింది.
తెలంగాణ టెట్ 2025 పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు కేటాయిస్తారు. అయితే ఇందులో జనరల్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు అవుతుంది. ఇందులో సాధించే స్కోర్ ఆధారంగా… డీఎస్సీ పరీక్షలో వేయిటేజీ కలుపుతారు.