తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ మేరకు జేఎన్టీయూ హైదరాబాద్ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
ఈసారి జరిగిన తెలంగాణ ఈఏపీసెట్ - 2025 పరీక్షలను చూస్తే.... అగ్రికల్చర్ విభాగానికి 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్ చూస్తే…. 2,07,190 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ ఈఏపీసెట్-2025 ఫలితాలు ప్రకటించిన తర్వాత https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి సాధించిన మార్కులతో పాటు ర్యాంకులు అందుబాటులో ఉంటాయి. ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి…
టీజీ ఈఏపీసెట్-2025 ఆధారంగా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ర్యాంక్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఫలితాలను ప్రకటించిన తర్వాత…కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. వీటి ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
గతేడాది చూస్తే మే 7వ తేదీన ఈఏపీసెట్ పరీక్షలు ప్రారంభం కాగా… 11వ తేదీతో ముగిశాయి. మే 18వ తేదీన తుది ఫలితాలను ప్రకటించారు. ఈసారి మే 4వ తేదీనే పరీక్షలు పూర్తికాగా… మే 11వ తేదీన విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. గతేడాదితో పోల్చితే ఈసారి కాస్త ముందుగానే ఫలితాలను విడుదల చేస్తున్నారు.కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా త్వరగా ప్రకటించి...సీట్ల భర్తీ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
గతేడాది ఫలితాలను చూస్తే…. ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో ఉత్తీర్ణత శాతం 74.98గా ఉంది.ఇందులోనూ అబ్బాయిలు 74.38 శాతం,అమ్మాయిలు 75.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లో చూస్తే అబ్బాయిలు 88.25 శాతం, అమ్మాయిలు 90.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 89.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
సంబంధిత కథనం