తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్, సెకండ్ ఫేజ్ ప్రక్రియలు పూర్తి అయ్యాయి. అయితే తాజాగా థర్డ్ ఫేజ్ సీట్లను విద్యార్థులకు కేటాయించారు. ఈ విడత కింద మొత్తం 85,680 మంది సీట్లు పొందారు.
థర్డ్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 30లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. జులై 1లోపు సీటు పొందిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసుకోకపోతే మీకు కేటాయించిన సీటు రద్దవుతుంది.
దోస్త్ థర్డ్ ఫేజ్ లో సీటు పొందే విద్యార్థులు https://dost.cgg.gov.in/welcome.do వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు. ఈ కాపీతో పాటు విద్యా అర్హత పత్రాలను సంబంధిత కాలేజీలో సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు లోపు రిపోర్టింగ్ తప్పకుండా చేయాలి. లేకపోతే సీటు రద్దవుతుంది. ఆ తర్వాత… మళ్లీ రిపోర్టింగ్ కు అవకాశం ఉండదు.
జూన్ 30వ తేదీ నుంచి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కాలేజీల్లో ఓరియేంటేషన్ కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
దోస్త్ మూడు విడతలు పూర్తి అయిన నేపథ్యంలో ఇంకా సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సీట్లు ఖాళీగా ఉంటేనే ఇందుకు అవకాశం ఉంటుంది. https://dost.cgg.gov.in/ లింక్ తో రిజిస్ట్రేషన్ తో పాటు ఫీజు చెల్లింపు, వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలను ఎంచుకోవాలి. వారి స్కోర్, రిజర్వేషన్ ఆధారంగా…. సీట్లను కేటాయిస్తారు. దోస్త్ రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మగాంధీ, తెలంగాణ వర్శిటీ,చాకలి ఐలమ్మ, శాతవాహన వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.