తెలంగాణలోని డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం చివరి విడత(థర్డ్ ఫేజ్) రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ గడువు కూడా దగ్గరపడింది. అర్హులైన అభ్యర్థులు జూన్ 19వ తేదీలోపే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు… వెబ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవాలి. సమయం దగ్గరపడిన నేపథ్యంలో…. అభ్యర్థులు వెంటనే ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
దోస్త్ 3వ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 13 నుంచి మొదలైంది. ఈ గడువు జూన్ 19తో పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్లు ఈ తేదీల్లోనే వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జూన్ 23న విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 23వ తేదీ నుంచి 28వ తేదీల మధ్య సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. జూన్ 24 నుంచి 28వ తేదీల మధ్య ఓరియేంటేషన్ ఉంటుంది. జూన్ 30వ తేదీన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి.
ఉన్నత విద్యామండలి నిర్ణయించిన మూడు విడతలు పూర్తి అయిన తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సీట్లు ఖాళీగా ఉంటేనే ఇందుకు అవకాశం ఉంటుంది.