రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ పరీక్షకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సీపీగెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కీలకమైన ఎంట్రెన్స్ పరీక్షల నోటిఫికేషన్లు రాగా... పరీక్షలు కూడా పూర్తవుతున్నాయి. అయితే సీపీగెట్ నోటిఫికేషన్ మాత్రం ఇంకా రాలేదు. కొన్ని కారణాలతో ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
గతేడాదిలో మే 16వ తేదీన సీపీగెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి జూన్ మాసం వచ్చినా ఇంకా రాలేదు. అయితే ఈ వారం రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీనే ప్రవేశ బాధ్యతలు చూడనుంది.
టీజీ సీపీగెట్ పరీక్షలు మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్-ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్లో పార్ట్-ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు. ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.