రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ పరీక్షకు ఉన్నత విద్యా మండలి కసరత్తు పూర్తి చేసింది. ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సీపీగెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. జూన్ 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్టీయూహెచ్ పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లోని కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్ - 2025 నిర్వహిస్తారు. ఇందుకు సబ్జెక్టుల వారీగా ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
గతేడాదిలో మే 16వ తేదీన సీపీగెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి మాత్రం ఆలస్యమైంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. విద్యార్థుల విజ్ఞప్తుల నేపథ్యంలో… ఈనెల 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. పూర్తి షెడ్యూల్ వివరాలను వెల్లడిస్తారు. దరఖాస్తుల స్వీకరణ తర్వాత… సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీనే సీపీగెట్ ప్రవేశ బాధ్యతలు చూడనుంది.
టీజీ సీపీగెట్ పరీక్షలో భాగంగా పలు సబ్జెక్టుల పరీక్షలను నిర్వహిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ 100 మార్కులకు నిర్వహిస్తారు.100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్-ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్లో పార్ట్-ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు. ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.