రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆలస్యం రుసుం లేకుండా అప్లికేషన్లు ముగియగా.. ప్రస్తుతం రూ. 2 వేల ఫైన్ తో అప్లయ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ గడువు కూడా జూలై 28వ తేదీతో పూర్తవుతుంది.
పీజీ చేయాలనుకునే అభ్యర్థులు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రేపటితో అప్లికేషన్ల స్వీకరణ మొత్తం ముగుస్తుందని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. https://cpget.tgche.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లించాలి.
ఆగస్టు 4వ తేదీ నుంచి టీజీ సీపీగెట్ - 2025 పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 11వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు ముగుస్తాయి. ప్రతి రోజూ 3 సెషన్లు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 1 నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఇక చివరి సెషన్ 4.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.
మొత్తం 45 సబ్జెక్టులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా తేదీలను https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్టీయూహెచ్ పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లోని కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్ - 2025 నిర్వహిస్తారు. ఇందుకు సబ్జెక్టుల వారీగా ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీనే సీపీగెట్ ప్రవేశ బాధ్యతలు చూస్తోంది.
టీజీ సీపీగెట్ -2025 లో భాగంగా పలు సబ్జెక్టుల్లో ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. విడతల వారీగా ప్రవేశాల ప్రక్రియను చేపడుతారు.