తెలంగాణ టెట్ - 2025 పరీక్షల (జూన్ సెషన్) ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా… వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించారు. దీంతో తుది ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.
తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చే వారం వచ్చే అవకాశం ఉంది. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే… జూలై 22వ తేదీన ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని ప్రక్రియలు పూర్తి కావటంతో… ఈ తేదీనే విడుదల చేస్తారని తెలుస్తోంది. ఒక వేళ ఏదైనా ఆలస్యమైనప్పటికీ.. ఒకటి రెండు రోజుల తేడాలోనే ప్రకటించే అవకాశం ఉంది.
జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు 16 సెషన్లలో టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా…. 47,224 మంది(74.65 శాతం) హాజరయ్యారు. అలాగే పేపర్ 2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 66,686 మందికి గానూ 48,998 మంది(73.48) హాజరయ్యారు. పేపర్ 2(సోషల్ స్టడీస్)కు 53,706 మందికి దరఖాస్తు చేసుకోగా…. 41,207 మంది(76.73 శాతం) మంది హాజరయ్యారు. వీరంతా కూడా టెట్ తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ టెట్ 2025 పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఉంటుంది. అయితే ఇందులో జనరల్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు అవుతుంది. ఇందులో సాధించే స్కోర్ ఆధారంగా… డీఎస్సీ పరీక్షలో వేయిటేజీ కలుపుతారు.
సంబంధిత కథనం