తెలంగాణలో ఈ ఏడాది రెండోసారి టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. ఈ పరీక్ష కోసం మొత్తం 2,75,773 మంది దరఖాస్తు చేశారు. పేపర్-1కు 94,335 అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోగా… పేపర్-2కు 1,81,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
తాజాగా టెట్ అభ్యర్థులకు విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. టెట్ సిలబస్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు వెబ్ సైట్ లో సిలబస్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. మొత్తం 15 పేపర్లకు సంబంధించిన సిలబస్ వివరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. https://tgtet2024.aptonline.in/ లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు సిలబస్ కాపీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే గత టెట్కు, తాజా టెట్ సిలబస్కు ఎటువంటి మార్పు లేదు.
‘టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్-1 సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకానికి, పేపర్-2 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. పేపర్-2లో మళ్లీ గణితం, సైన్స్, సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కులకు ఉంటుంది. పేపర్-1కు 1-8 తరగతులు, పేపర్-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి.
అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.
టెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. అయితే ఇందులో జనరల్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అలాగైతేనే టెట్ లో అర్హత సాధించినట్లు అవుతారు. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు అవుతుంది. టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ రాసేందుకు అర్హులవుతారు. ఇక గురుకులాల్లో టీజీటీ ఉద్యోగాలకు కూడా టెట్ అర్హత తప్పనిసరి.
సంబంధిత కథనం