తెలంగాణ పదో తరగతి 2025 ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈసారి 5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వరకు టెన్త్ పరీక్షలు జరిగాయి. పరీక్షలు పూర్తయిన వెంటనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా... ఏప్రిల్ మూడో వారం నాటికి మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత కోడింగ్, డీకోడింగ్ వంటి సాంకేతిక అంశాలను పూర్తి చేశారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి.... ఫలితాల వెల్లడి తేదీని అధికారులు ప్రకటించారు.
గతంలో పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. మార్కుల మెమోలపైనా సబ్జెక్టుల వారీగా మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ ప్రింట్ చేస్తారు. చివరిగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా అనే వివరాలను ముద్రిస్తారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ తాజాగా స్పష్టం చేసింది.
గతేడాది మాదిరిగానే తెలంగాణ పదో తరగతి ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి సింగిల్ క్లిక్ తోనే మార్కుల వివరాలను పొందవచ్చు. ఇందులో గ్రేడింగ్ తో పాటు మార్కుల వివరాలను కనిపిస్తాయి. పాస్, ఫెయిల్ వివరాలు కూడా డిస్ ప్లే అవుతాయి.
తెలంగాణ పదో తరగతి 2025 ఫలితాలను పదో తరగతి బోర్డు వెబ్ సైట్ https://bse.telangana.gov.in లోనూ పొందవచ్చు. తెలంగాణ పదో తరగతి 2025 ఫలితాల లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ మార్కుల వివరాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి మార్కుల కాపీని పొందవచ్చు.
ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 2,650 కేంద్రాల్లో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ విద్యార్థులంతా ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టగా.... ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తి చేశారు.
గతేడాది ఏప్రిల్ 2తో పదో తరగతి పరీక్ష ఫలితాలు పూర్తి కాగా…. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ పదో తరగతి ఫలితాలను ప్రకటించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీతో ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఈసారి కూడా ఏప్రిల్ 30వ తేదీనే ప్రకటిస్తున్నారు. ఫలితాలను ప్రకటించిన వెంటనే సప్లిమెంటరీ పరీక్ష తేదీలతో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తేదీల వివరాలను ప్రకటిస్తారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థులు.... ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం