తెలంగాణ పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి(2025-26) సంబంధించిన ఎంట్రెన్స్ పరీక్షను మే 13వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
ఆన్ లైన్ దరఖాస్తులు, ఫీజులు, ఎడిట్ ఆప్షన్, హాల్ టికెట్ల జారీ తేదీ వంటి వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇవా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి కసరత్తు పూర్తి చేసింది.
ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహించనున్నారు. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పాలిసెట్ రాతపరీక్షకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది.
తెలంగాణ పాలిసెట్ ఎంట్రెన్స్ ప్రవేశ పరీక్ష ద్వారా పీవీ.నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలోని పశుసంవర్థన - మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు( PVNRTVU), కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయంలోని (SKLTSHU) ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ( PJTSAU) ద్వారా అందిస్తున్న వ్యవసాయ కోర్సుల్లో కూడా అడ్మిషన్లు(PolyCET Admissions) కల్పిస్తారు. వీటితో పాటు తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లోని కోర్సులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ విద్యాసంస్థలు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
ఇక ఏపీ పాలిసెట్ పరీక్ష తేదీ కూడా ఖరారైంది. పాలీసెట్-2025 ను ఏప్రిల్ 30 నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని 69 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
అప్లికేషన్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపట్టింది. పరీక్షను ఏప్రిల్ 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు.
సంబంధిత కథనం