తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది.
ఇంటర్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాభ వన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫలితాలను ప్రకటిస్తారు. ఈసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం… సుమారుగా 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది కాగా.. రెండవ సంవత్సరం విద్యార్థులు 5,08,253 మంది ఉన్నారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పరీక్షలను మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించారు. పరీక్షలు ఓవైపు కొనసాగుతుండగానే.. మరోవైపు స్పాట్ ప్రక్రియను కూడా బోర్డు చేపట్టింది. మొత్తం నాలుగు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసింది.
జవాబు పత్రాల మూల్యాంకం తర్వాత…. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)లో క్రోడీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. ఫలితాల విడుదలకు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వగా… ఏప్రిల్ 22వ తేదీని ఖరారు చేసింది. గత ఏడాదిలో చూస్తే తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 24న ప్రకటించారు. అయితే ఈసారి రెండు రోజుల ముందుగానే ఫలితాలను వెల్లడించనున్నారు.
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ఇంటర్ 2025ఫలితాలు హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. సింగిల్ క్లిక్ తోనే మీ మార్కులు డిస్ ప్లే అవుతాయి. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తో పాటు వొకేషనల్ కోర్సుల ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన లింక్స్ ఇక్కడ చూడండి….
తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ https://tgbie.cgg.gov.in/ లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఐవీఆర్ పోర్టల్ 9240205555 ఫోన్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాల విడుదల రోజే సప్లిమెంటరీ పరీక్షల తేదీలతో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వివరాలను కూడా ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటిస్తారు.