పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు పారిశ్రామిక శిక్షణ ఇస్తున్న ఐటీఐలలో అధునాతన సాంకేతిక శిక్షణ కేంద్రాలు(ఏటీఎస్) ఏర్పాటుచేస్తున్నారు. ఈ ఏటీఎస్లకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ నిధులు సమకూరుస్తుంది. తెలంగాణలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో పారిశ్రామిక శిక్షణను ఉచితంగా ఇవ్వడమే కాకుండా, శిక్షణ పూర్తయిన వారికి టాటా, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
పేద పిల్లలకు ప్రభుత్వ ఐటీఐ, కళాశాలల్లో వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉండడంలేదు. వీటి కోసం పట్టణాల్లో వేలాది రూపాయలు ఖర్చు చేసి విద్యనభ్యసించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పేద విద్యార్థులకు భారంగా మారుతుంది. ఈ క్రమంలో ఏటీఎస్ కోర్సులు పేద విద్యార్థులు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి, మంచిర్యాల, జన్నారం, శ్రీరాంపూర్, బెల్లంపల్లిలో ఏటీఎస్ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. మందమర్రి ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ప్రభుత్వం భాగస్వామ్యంతో టాటా టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ రూ.4 కోట్లతో ఏటీఎస్ భవనాన్ని నిర్మించింది.
దీంతో 74 సీట్లకు పూర్తి స్థాయిలో విద్యార్థులు చేరారు. అధునాతన సాంకేతిక హంగులతో నిర్మించిన ఈ భవనంలో ఆధునిక విధానంలో విద్యార్థులు శిక్షణ ఇస్తున్నారు. ఈ కేంద్రంలో సీట్ల కోసం పోటీ నెలకొంది.
ఏటీఎస్ లో కోర్సులు పూర్తి చేసిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా టాటా, మహీంద్ర కంపెనీలతో పాటు ఇతర ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. ఇండస్ట్రీ-రిలేటెడ్ ట్రేడ్స్ అయిన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఐటీ, ఆటోమొబైల్ లో ఆరు నుంచి ఏడాది పాటు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
తెలంగాణ ప్రభుత్వం, టాటా ఏటీఎస్ కేంద్రాల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు సులభంగా లభిస్తాయని నిర్వాహకులు అంటున్నారు. పేద విద్యార్థులకు ఇదొక సదవకాశమని పేర్కొన్నారు.
సంబంధిత కథనం