తెలంగాణలోని యూనివర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీల్లో.. దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. గతంలో దోస్త్ ప్రక్రియ ఇంటర్ రిజల్ట్ వచ్చిన రెండ్రోజుల్లో ప్రారంభం అయ్యింది. కానీ దోస్త్ 2025 నోటిఫికేషన్ విడుదలపై సందిగ్ధత నెలకొంది. మామూలుగా అయితే.. ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటిరోజే దోస్త్ షెడ్యూల్ జారీచేసేవారు. ఈసారి ఫలితాలు వచ్చి వారం రోజులైనా నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఈసారి రెండు విడతల్లోనే దోస్త్ ద్వారా ప్రవేశాలు ఇచ్చి.. జూన్ 16 నుంచి తొలి సెమిస్టర్ తరగతులను ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ భావించింది. అయితే ఇప్పటివరకు దోస్త్ నోటిఫికేషన్ వెలువడకపోవడంతో.. షెడ్యూల్ ప్రకారం తరగతులు మొదలవుతాయా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి దోస్త్లో బకెట్ విధానాన్ని తొలగించాలని కొద్దిరోజుల కిందట ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన ఉపకులపతుల సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు.
అయితే ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నత విద్యామండలికి, వీసీలకు లేదని.. తమకు సమాచారం లేకుండా.. తమ ఆమోదం లేకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని విద్యాశాఖలోని ఓ అధికారి ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పది రోజుల కిందట వీసీలతో సమావేశం నిర్వహించి.. ఈసారికి యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశానికి సంబంధించి తీర్మానాల కాపీ ఇంతవరకు అందలేదు. ఈ కారణంగా ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేయలేదని అంటున్నారు.
దోస్త్ నోటిఫికేషన్ ఏప్రిల్ చివర్లో విడుదలయ్యే అవకాశం ఉందని మొదట చెప్పారు. కానీ ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఈ ఏడాది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మే మొదటి వారంలో ప్రారంభం కావచ్చని అంటున్నారు. దానిపైనా క్లారిటీ లేదు. ఈ సంవత్సరం దోస్త్ కన్వీనర్గా.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి వ్యవహరించనున్నారని తెలుస్తోంది.
తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు ఈ ప్రక్రియ ద్వారా జరుగుతాయి. కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ కూడా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం దోస్త్ అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు.
సంబంధిత కథనం