ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 1620 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఆఫీస్ సబార్డినేట్ (651) ఖాళీలు ఉండగా… ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 230 ఉన్నాయి. జిల్లాల వారీగా వీటిని రిక్రూట్ చేస్తారు.
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు ఏపీ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. మే 13వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుండగా… జూన్ 2వ తేదీతో ముగుస్తుంది. దరఖాస్తు చేసుకునే ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 400 ఫీజు చెల్లించాలి. ఆఫీస్ సబార్డినెట్ పోస్టులకు ఏడో తరగతి ఉండగా.. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. విద్యా అర్హతల పూర్తి వివరాలను aphc.gov.in/recruitments వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
కాపీయిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్, డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. తప్పనిసరిగా టైపింగ్ వచ్చి ఉండటమే కాకుండా… కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి. కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా స్థానిక భాష వచ్చి ఉండాలి. అంతేకాకుండా వయసు 42 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్లు ఉన్న వారికి వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది.
కోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాల్డెజ్ ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు. కొన్ని ఉద్యోగాలకు నైపుణ్య పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. మార్కులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.
కోర్టు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే helpdesk-hc.ap@aij.gov.in కు మెయిల్ చేయవచ్చు. లేదా 0863-2372752 నెంబర్ ను సంప్రదించవచ్చు. ఉదయం 10. 30 నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో కాల్స్ చేయవచ్చు. కేవలం పని దినాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.