రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి ప్రకటన విడుదల చేశారు. సొసైటీ పరిధిలో మొత్తం 239 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హులైన విద్యార్థులు https://tgswreis.telangana.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పాలైన విద్యార్థులకు దీంట్లో ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలు మించకూడదు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులు అర్హులు. దరఖాస్తు చేసె సమయంలో అడిగిన అన్ని వివరాలు సమర్పించాలి. లేకపోతే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
ఈ సొసైటీ పరిధిలోని ఒక్కో కాలేజీలో మొత్తం 40 సీట్లు ఉంటాయి. ఎస్సీలకు 75 శాతం.. అంటే 30 సీట్లు కేటాయిస్తారు. ఎస్టీలకు 6 శాతం (2 సీట్లు) ఉంటాయి. బీసీలకు 12 శాతం (5 సీట్లు), మైనార్టీలకు 3 శాతం (1 సీటు), ఓసీలకు 4 శాతం (2 సీట్లు) కేటాయిస్తారు. ఇవే కాకుండా.. 3 శాతం దివ్యాంగులకు, మరో 3 శాతం తల్లిదండ్రులు లేని పిల్లలకు రిజర్వ్ చేస్తారు. ఎలాంటి సందేహాలు ఉన్నా.. హెల్ప్ లైన్ నంబర్ 040- 23391598 కు కాల్ చేయవచ్చు.
తెలంగాణ ఎస్సీ గురుకులాల సొసైటీ.. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా సంస్థల సమాఖ్య. దీనిని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ అని కూడా అంటారు. ఈ సొసైటీ దాదాపు 1000 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను నిర్వహిస్తోంది. ఈ గురుకుల పాఠశాలల్లో ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.
ఎస్సీ విద్యార్థులకు ఇతర విద్యార్థులతో సమానంగా నాణ్యమైన విద్యను అందించడం, పేద, వెనుకబడిన ఎస్సీ విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తేవడం, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడటం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, భవిష్యత్తుకు సిద్ధం చేయడం ఈ సొసైటీ లక్ష్యాలు. ఈ సొసైటీ కేవలం పాఠశాలలే కాకుండా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలను కూడా నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఎస్సీ విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది.
సంబంధిత కథనం