సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన నేపథ్యంలో విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా ఆశించిన స్కోర్ రాని కారణంగా నిరుత్సాహానికి గురైన విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా ‘‘ఒకే ఒక్క పరీక్ష వారి విలువను నిర్ణయించదని, వారి నిజమైన సామర్థ్యాలు వారి మార్క్ షీట్లకు మించి విస్తరించి ఉంటాయి’’ అని ఆయన నొక్కి చెప్పారు.
'సీబీఎస్ఈ 12, 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. ఇది మీ సంకల్పం, క్రమశిక్షణ, కృషి ఫలితమే' అని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'ఎక్స్' లో ప్రధాని మోదీ పోస్టు చేశారు. ఈ ఘనతకు దోహదపడిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతరుల పాత్రను గుర్తించాల్సిన రోజు కూడా ఈ రోజు అని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే అన్ని పరీక్షల్లో ఎగ్జామ్ వారియర్స్ గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు.
సీబీఎస్ 10 వ తరగతి, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో సరైన స్కోర్ సాధించని వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ వారిలో స్ఫూర్తి నింపేలా వ్యాఖ్యానించారు. "ఆశించిన స్కోర్ రాలేదని కొద్దిగా నిరాశకు గురైనవారికి, నేను వారికి చెప్పాలనుకుంటున్నాను: ఒక పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించదు. మీ ప్రయాణం చాలా పెద్దది. మీ సామర్ధ్యాలు మార్క్ షీట్ ను మించి ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఆసక్తిగా ఉండండి, ఎందుకంటే గొప్ప విషయాలు వేచి ఉన్నాయి. #ExamWarriors" అని ప్రధాని తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మంగళవారం 10, 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. 10వ తరగతి, 12వ తరగతిలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. 12వ తరగతిలో బాలికలు 91 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలుర కంటే 5.94 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా పదో తరగతిలో 95 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, బాలుర కంటే 2.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. సీబీఎస్ఈ ఈ గణాంకాలను అధికారిక పత్రికా ప్రకటనలో పంచుకుంది. ఈ ఏడాది 93 శాతానికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగా, 12వ తరగతి ఉత్తీర్ణత శాతం 88.39 శాతంగా నమోదైంది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.
సంబంధిత కథనం