PM Internship 2025 : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు పొడిగింపు.. సెలక్ట్ అయితే నెలకు రూ.5 వేలు!-pm internship scheme 2025 deadline extended till 31st march heres direct link to application ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Pm Internship 2025 : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు పొడిగింపు.. సెలక్ట్ అయితే నెలకు రూ.5 వేలు!

PM Internship 2025 : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు పొడిగింపు.. సెలక్ట్ అయితే నెలకు రూ.5 వేలు!

Anand Sai HT Telugu

PM Internship Scheme 2025 : ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 రెండో దశ దరఖాస్తు గడువును పొడిగించారు. ఆసక్తిగల అభ్యర్థులు pminternship.mca.gov.in వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్లై చేసుకోవాలనుకుని మరిచిపోయినవారికి గుడ్‌న్యూస్. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 రెండో దశ దరఖాస్తు గడువును పొడిగించారు. మీరు ఇంకా దరఖాస్తు చేయకపోతే.. pminternship.mca.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోండి. లేదంటే ఇంటర్న్‌షిప్ స్కీమ్ పొందే సువర్ణావకాశం మీ చేతుల్లోంచి పోతుంది.

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రెండో దశలో మొత్తం లక్ష మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పీఎం ఇంటర్న్‌షిప్ రెండో దశ కోసం మొదట దరఖాస్తుకు చివరి తేదీని 12 మార్చి 2025గా నిర్ణయించారు. కానీ ఇప్పుడు అభ్యర్థులు 31 మార్చి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ఎలా అప్లై చేయాలి?

1. ముందుగా అభ్యర్థి pminternship.mca.gov.in అధికారిక వెబ్‌సైట్ వెళ్లాలి.

2. ఆ తర్వాత హోమ్ పేజీలో ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి.

3. తరువాత మీరు మీ మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.

4. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్‌తోపాటు అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

5. అనంతరం మీ అప్లికేషన్ ఫామ్‌ చెక్ చేసి సబ్మిట్ చేయండి.

6. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి.

అర్హతలు

21-24 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ యువత ఎటువంటి పూర్తికాల ఉద్యోగం లేదా విద్యలో ఉండకూడదు. 10వ తరగతి లేదా 12వ తరగతి పాస్, యూజీ/పీజీ ఉత్తీర్ణత ఉండి.. వయసు 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం 8 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారు అనర్హులు.

కుటుంబంలో ఎవరైనా పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తే అలాంటి కుటుంబానికి చెందిన యువకులు అనర్హులు. ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐడీ, ఐఐఐటీ, ఎన్ఎల్యూ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ చేసినవారు ఇందులో దరఖాస్తు చేయలేరు. సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ లేదా ఉన్నత చదువులు చదివినవారు దీనికి దరఖాస్తు చేయకూడదు. ఏదైనా ప్రభుత్వ పథకం కింద నైపుణ్య శిక్షణ పొందుతున్న యువత కూడా దీనిని సద్వినియోగం చేసుకోలేరు.

స్టైఫండ్ ఎంత వస్తుంది?

అభ్యర్థికి ప్రతి నెలా ఐదు వేల రూపాయలు లభిస్తాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం 4500 రూపాయలు, సీఎస్ఆర్ ఫండ్ నుండి 500 రూపాయలు ఇస్తుంది. ఇదికాకుండా అభ్యర్థులకు అదనంగా ఒకేసారి రూ.6వేలు ఏకమొత్తంగా ఇవ్వనున్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం