Anganwadi Posts : మ‌న్యం జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌, దరఖాస్తు విధానం ఇలా?-parvathipuram manyam anganwadi posts recruitment eligibility offline apply process ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Anganwadi Posts : మ‌న్యం జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌, దరఖాస్తు విధానం ఇలా?

Anganwadi Posts : మ‌న్యం జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌, దరఖాస్తు విధానం ఇలా?

HT Telugu Desk HT Telugu
Jan 20, 2025 07:09 PM IST

Anganwadi Posts : పార్వతీపురం మన్యం జిల్లాలో 11 అంగన్ వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 27వ తేదీ లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగ‌న్‌వాడీ స‌హాయ‌కురాల పోస్టులను ప‌దో త‌ర‌గ‌తి అర్హత‌తో భ‌ర్తీ చేస్తారు.

 మ‌న్యం జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌, దరఖాస్తు విధానం ఇలా?
మ‌న్యం జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌, దరఖాస్తు విధానం ఇలా?

Anganwadi Posts : పార్వతీపురం మ‌న్యం జిల్లాలో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తుదాఖ‌ల‌కు జ‌న‌వ‌రి 27 ఆఖ‌రు తేదీ కాగా, ఆ త‌రువాత ఇంట‌ర్వ్యూల‌ను నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా మ‌హిళ‌, శిశు సంక్షేమ, సాధికారిత అధికారి వారి కార్యాల‌యం నుంచి వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల ప‌రిధిలో ఖాళీగా ఉన్న అంగ‌న్‌వాడీ స‌హాయ‌కురాల (హెల్పర్స్) పోస్టులను ప‌దో త‌ర‌గ‌తి అర్హత‌తో భ‌ర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు.

yearly horoscope entry point

పోస్టులు ఎన్ని? ఎక్కడెక్కడ‌?

మొత్తం 11 అంగ‌న్‌వాడీ స‌హాయ‌కుల పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. పార్వతీపురం మ‌న్యం జిల్లాలో పాల‌కొండ డివిజ‌న్‌లో సీతంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు ప‌రిధిలో రెండు, భామిని ఐసీడీఎస్ ప్రాజెక్టు ప‌రిధిలో ఒక‌టి, కురుపాం ప్రాజెక్టు ప‌రిధిలో ఆరు, పార్వతీపురం డివిజ‌న్‌లోని పార్వతీపురం ప్రాజెక్టు ప‌రిధిలో ఒక‌టి, సాలూరు ప్రాజెక్టు ప‌రిధిలో ఒక‌టి పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ టి. క‌న‌క‌దుర్గ తెలిపారు. షెడ్యూల్ ట్రైబ‌ల్ హ్యాబిటేష‌న్ గ్రామాల‌ను అనుస‌రించి షెడ్యూల్ ట్రైబ‌ల్ అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరారు.

ఐసీడీఎస్ ప్రాజెక్టు ఒక యూనిట్‌గా ప‌రిగ‌ణించి కేట‌గిరి నిర్ధారించి పోస్టుల‌ను ప్రక‌టించామ‌న్నారు. ఈ ఉద్యోగుల‌కు స్థానికంగా నివాసిస్తున్న వివాహిత మ‌హిళలు మాత్రమే అర్హులు. కాబ‌ట్టి ఎంపికైన వారు తాము నివసిస్తున్న ప్రదేశంలోనే ఉద్యోగం చేయొచ్చు. అర్హత గ‌ల వారు జ‌న‌వ‌రి 27 తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు సంబంధిత సీడీపీఓ కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట‌ర్వ్యూ తేదీ, స్థలం త్వర‌లో వెల్లడిస్తారు.

విద్యార్హత...వ‌యో ప‌రిమితి

అంగ‌న్‌వాడీ హెల్పర్ల పోస్టుల‌కు ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేయ‌డం త‌ప్పనిస‌రి. 2024 జులై 1 నాటికి క‌నీస వ‌య‌స్సు 21 నుంచి 35 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. ఆయా పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు క‌లిగిన అభ్యర్థి లేక‌పోయిన‌ట్లుయితే 18 సంవ‌త్సరాలు నిండిన వారి అప్లికేష‌న్ కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. అయితే ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త సాధించిన వారు లేక‌పోతే, దాని కంటే త‌క్కువ విద్యార్హత క‌లిగిన వారిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోనున్నారు.

జీతం

అంగ‌న్‌వాడీ హెల్పర్లకు రూ.7,000 నెల జీతం ఉంటుంది. ఇంట‌ర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎటువంటి ప‌రీక్ష లేదు. ఎటువంటి అప్లికేష‌న్ ఫీజు లేదు. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత సీడీపీఓ కార్యాల‌యంలో త‌మ అప్లికేష‌న్ అంద‌జేయాలి. అప్లికేష‌న్ జ‌న‌వ‌రి 20 తేదీ నుంచి దాఖ‌లు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తును పూర్తి చేసి, బ‌యోడేటాతో పాటు అన్ని విద్య అర్హత, ఇత‌ర స‌ర్టిఫికేట్లు జిరాక్స్ కాపీల‌పై గెజిటెడ్ ఆఫీస‌ర్‌తో అటెస్టేష‌న్ చేయించి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాల‌యంలో అప్లికేష‌న్ అంద‌జేయాలి. సంబంధిత ఐసీడీఎస్ కార్యాల‌యాల్లో అప్లికేష‌న్‌ను జ‌న‌వ‌రి 27వ‌తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు అంద‌జేయాల్సి ఉంటుంది.

మార్కులు ఇలా

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఉత్తీర్ణ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు 50 మార్కులు, ప్రీస్కూల్ టీచ‌ర్‌, కృషి, ప్రీస్కూల్ మేనేజ్‌మెంట్ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు, గుర్తింపు పొందిన యూనివ‌ర్శిటీ నుంచి పొందిన స‌ర్టిఫికేట్ క‌లిగిన వారు లేదా ఈసీఈ వ‌ర్క్‌గా ప‌ని చేస్తున్న వారికి 5 మార్కులు, పూర్తి ఆనాథ‌, బాల‌స‌ద‌న్ ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ఉండి మంచి న‌డ‌వ‌డిక‌, స‌త్ప్ర‌వ‌ర్త‌న స‌ర్టిఫికేట్ క‌లిగిన వారికి 10 మార్కులు, వితంతువుల‌కు 5 మార్కులు, మైనార్టీ తీర‌ని పిల్ల‌లు క‌లిగిన వితంతువుల‌కు 5 మార్కులు, అర్హ‌త క‌లిగిన దివ్యాంగుల‌కు 5 మార్కులు, ఇంట‌ర్వ్యూకు 20 మార్కులు మొత్తం 100 మార్కుల‌కు ఉంటుంది. పూర్తి వివ‌రాలు కావాల‌నుకునే అభ్య‌ర్థులు మండ‌ల శిశు సంక్షేమ కార్యాల‌యాల్లో సంప్ర‌దించాలి. అందులో రిజ‌ర్వేష‌న్‌, అర్హ‌త‌ల వంటి అన్ని వివ‌రాలు ఉంటాయ‌ని ఐసీడీఎస్ పీడీ టి. క‌న‌క‌దుర్గ తెలిపారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం