మెగా డిఎస్సీ 2025కు దరఖాస్తు చేయడానికి మరో రెండు రోజులే గడువు..ఇప్పటికే 4.77 ల‌క్షల దరఖాస్తులు..-only two more days left to apply for mega dsc 2025 4 77 lakh applications already received ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  మెగా డిఎస్సీ 2025కు దరఖాస్తు చేయడానికి మరో రెండు రోజులే గడువు..ఇప్పటికే 4.77 ల‌క్షల దరఖాస్తులు..

మెగా డిఎస్సీ 2025కు దరఖాస్తు చేయడానికి మరో రెండు రోజులే గడువు..ఇప్పటికే 4.77 ల‌క్షల దరఖాస్తులు..

Sarath Chandra.B HT Telugu

ఏపీలో మెగా డిఎస్సీ 2025 దరఖాస్తు గడువు సమీపిస్తోంది. మరో రెండు రోజుల్లో డిఎస్సీ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. ఇప్పటికే 3.03లక్షల మంది డిఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. వేర్వేరు పోస్టులతో కలిపి మొత్తం దరఖాస్తుల సంఖ్య 4.77లక్షలు దాటేసింది.

డిఎస్సీ దరఖాస్తులకు మరో రెండు రోజులే గడువు

ఏపీ మెగా డిఎస్సీ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. గత నెలలో డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తుల స్వీకరణ గడువు మే 15తో ముగుస్తుంది.

మే 15తో ముగియనున్న డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ

ఏపీ మెగా డిఎస్సీ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుండటంతో అభ్యర్థులు త్వరతగతిన దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం మెగా డీఎస్సీ -2025 దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15తో ముగియనుంది.

డిఎస్సీ ఆశావహులు చివరి రోజు వరకూ ఆగకుండా, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సూచించారు.

ఏప్రిల్‌ 20వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటివరకు డిఎస్సీకి 3,03,527 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 4,77,879 ల దరఖాస్తులు అందాయి. మే 15వ తేదీ వరకు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరగనుంది.

అభ్యర్థుల ఎదురు చూపులు

డిఎస్సీ నిర్వహణ కోసం అభ్యర్థులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు. 2024లో డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైనా ఎన్నికల కోడ్‌ రావడంతో అది జరగలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాత నోటిఫికేషన్‌ రద్దు చేసి మెగా డిఎస్సీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది.

గత 30ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే 13 డిఎస్సీలను నిర్వహించి, 1,80,272 టీచర్ పోస్టులను భర్తీచేసినట్టు లోకేష్‌ గతంలో చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో 2014-19 నడుమ చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం 2014,18,19లలో మూడు డిఎస్సీల నిర్వహణ ద్వారా 16,701 టీచర్ పోస్టులను భర్తీచేసిందని చెప్పారు.

టీడీపీ హయంలో 13సార్లు డిఎస్సీ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించినట్టు అసెంబ్లీలో లోకేష్‌ ప్రకటించారు. 1994లో 16,238 పోస్టులు, 1996లో 16,838 పోస్టులు, 1998లో 29,269 పోస్టులు, 2000 సంవత్సరంలో 24,388 పోస్టులు, 2001లో 26,129, 2002లో 31,699పోస్టులు, 2003లో 12,430 పోస్టులు, 2014లో 8,926 పోస్టులు, 2018లో 7,254 పోస్టులతో మొత్తం 9 సార్లు 1,73,171 పోస్టులను భర్తీ చేసినట్టు లోకేష్ తెలిపారు.

డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్‌ చేయాల్సిన పనిలేదు..

ఏపీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌లో అప్లై చేసే సమయంలోనే ధృవపత్రాలు అప్‌లోడ్ చేయాలని నిబంధన విధించారు. దీంతో అభ్యర్థులు కీలకమైన పరీక్షల సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. దీంతో డిఎస్సీ నోటిఫికేషన్‌లో విధించిన పలు నిబంధనలతో అభ‌్యర్థులు ఇబ్బందులు పడుతుండటంత వాటిని సవరిస్తున్నట్టు నారా లోకేష్‌ ఎక్స్‌లో ప్రకటించారు.

దరఖాస్తు చేసే సమయంలోనే సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలనే నిబంధనతో అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. డిఎస్సీకి దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాల కోసం కీలకమైన సమయం వృధా అవుతున్న విషయాన్ని గుర్తించిన మానవ వనరుల శాఖ మంత్రి నారాలోకేష్‌ అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. దరఖాస్తు చేసే సమయంలో సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయడం ఆప్షనల్ మాత్రమేనని, సర్టిఫికెట్ వెరిఫకేషన్ సమయంలో ఒరిజినల్ పత్రాలను సమర్పించాలని ఆదేశించారు.

40శాతం మార్కులు చాలు..

గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్ మార్కుల నిబంధనల్లో కూడా సడలింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్‌ , పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లలో కనీస విద్యార్హత 40శాతంగా నిర్ణయించినట్టు ప్రకటించారు. కనీసం 45-50శాతం మార్కుల ఉండాలని తొలుత నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో లక్షలాది మందికి డిఎస్సీకు దరఖాస్తు చేసే అవకాశం లేకుండా పోయింది. దీనిపై రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అర్హత మార్కులను తగ్గించారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం