ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ రెండో విడత ఫలితాలు రాత్రి 12 గంటలకు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో రిజల్ట్ విడుదల చేశారు. ఈ పరీక్షలో 21 మంది జనరల్ కేటగిరీ విద్యార్థులు 100 ఎన్టీఏ స్కోర్లు సాధించారు. ఈడబ్ల్యూఎస్లో తెలంగాణకు చెందిన వి.అజయ్ రెడ్డికి, ఓబీసీలో ఢిల్లీకి చెందిన దక్ష్కు, ఎస్సీలో యూపీకి చెందిన శ్రేయాస్ లోహియా టాప్ స్కోర్ సాధించారు.
100 పర్సంటైల్ సాధించిన 24 మంది టాపర్లలో 22 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. బెంగాల్కు చెందిన దేవదత్త మాఝీ, ఆంధ్రాకు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ ఈ ఘనత సాధించారు. టాపర్లలో రాజస్థాన్ నుంచి ఏడుగురు, తెలంగాణ నుంచి ముగ్గురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు, పశ్చిమబెంగాల్ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు, ఢిల్లీ నుంచి ఇద్దరు, కర్ణాటక నుంచి ఒకరు, గుజరాత్ నుంచి ఇద్దరు ఉన్నారు.
ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటారు. హైదరాబాద్కు చెందిన ఇద్దరు జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. బనిబ్రత మాజీ, వంగల అజయ్ రెడ్డి 300కి 300 మార్కులు వచ్చాయి. దీంతో ఎన్టీఏ ఒకే ర్యాంకు కేటాయించింది. ఈడబ్ల్యూఎస్ విభాగంలో కూడా అజయ్ రెడ్డి ప్రథమ ర్యాంకు వచ్చింది. ఈ విద్యార్థి సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా తాటిపాడు. అయితే తొమ్మిదో తరగతి నుంచి హైదరాబాద్లోనే చదువుతున్నాడు.
మెుత్తం 14.75 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. జనరల్ విభాగంలో 93.102, ఈడబ్ల్యూఎస్-80.383, ఓబీసీ-79.431, ఎస్సీ-61.15, ఎస్టీ-47.90 పర్సంటైల్ స్కోరును కటాఫ్గా నిర్ణయించారు. రెండు విడుతల్లో మెుత్తం 24 మందికి 100 పర్సంటైల్ వచ్చింది. తెలంగాణ నుంచి బనిబ్రత మాజీ, హర్ష్ ఎ గుప్తా, అజయ్ రెడ్డి ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి గుత్తికొండ సాయి మనోజ్ఞ ఉన్నారు.
ఈ ఏడాది అడ్వాన్స్డ్ కు 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులు అర్హత సాధించారు. ఈ రేసులో 2,50,236 మంది విద్యార్థులు ఉన్నారు. గతేడాది ఈ సంఖ్య 2,50,284గా ఉంది. పర్సంటైల్ స్కోరుకు సమానం లేదా అంతకంటే ఎక్కువ సాధించిన విద్యార్థులు మాత్రమే మే 18వ తేదీన నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు.
టాపర్ల లిస్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టాపిక్