ఏపీ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ ఉద్యోగాలు - 7వ తరగతి అర్హతతోనే, పూర్తి వివరాలివే...!-notification released for the recruitment of driver posts in ap district courts key details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ ఉద్యోగాలు - 7వ తరగతి అర్హతతోనే, పూర్తి వివరాలివే...!

ఏపీ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ ఉద్యోగాలు - 7వ తరగతి అర్హతతోనే, పూర్తి వివరాలివే...!

ఏపీ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 28 ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మే 13వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి….

ఏపీ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ ఉద్యోగాలు - నోటిఫికేషన్ విడుదల

ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అన్ని రకాల పోస్టులు కలిపి 1,620 ఉద్యోగాలున్నాయి. అయితే ఇందులో 28 డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఏడో తరగతి అర్హత ఉండి… డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డ్రైవర్ పోస్టులు - ముఖ్య వివరాలు

  • మొత్తం 28 ఖాళీలు ఉన్నాయి. ఈ మేరకు హైకోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది.
  • జిల్లా కోర్టుల్లో భర్తీ చేసే డ్రైవర్ పోస్టులకు మే 13వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 2వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది.
  • దరఖాస్తు చేసుకునే ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 400 ఫీజు చెల్లించాలి.
  • 2025 జులై 1వ తేదీ నాటికి 18 - 42 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ ఉన్న వారికి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
  • 7వ తరగతి ఉత్తీర్ణత లేదా అందుకు సమానమైన పరీక్షలో పాసై ఉండాలి.
  • లైట్ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. వాహనం నడిపిన అనుభవం ఉండాలి.
  • డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు స్థానిక భాష అయిన తెలుగు వచ్చి ఉండాలి.
  • అనంతపురం జిల్లా అభ్యర్థులకు తెలుగుతో పాటు కన్నడ వచ్చి ఉండాలి. చిత్తూరు వాళ్లకు తమిళం వచ్చి ఉండాలి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులకు తెలుగుతో పాటు ఒడిశా భాషా తెలిసి ఉండాలి.
  • ఉమ్మడి జిల్లాల ప్రతిపాదిన ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.

రాత పరీక్ష - ఎంపిక విధానం…

డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. మొత్తం 80 మార్కులకు ఉంటుంది. మరో 20 మార్కులు స్కిల్ టెస్ట్ కు కేటాయించారు. 80 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో…… జనరల్ నాల్డెజ్ కి 40, జనరల్ ఇంగ్లీష్ 10, మెంటల్ ఎబిలీటికి 30 మార్కులు ఉంటాయి. సిలబస్ వివరాలను aphc.gov.in/recruitments వెబ్ సైట్ లో చూడొచ్చు. పరీక్ష సమయం 90 నిమిషాలు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ తో పాటు తెలుగు మీడియంలోనూ ఇస్తారు.

రాత పరీక్షలో ఈడబ్యూఎస్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఇక బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు రావాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. దీని ఆధారంగా 1.3 నిష్పత్తిలో స్కిల్ టెస్ట్ (డ్రైవింగ్) కు పిలుస్తారు. రాత పరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది జాబితాను విడుదల చేస్తారు.

అప్లికేషన్ ప్రాసెస్….

డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లు https://aphc.gov.in/recruitments.php వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. పార్టీ ఏ తో పాటు పార్ట్ బీ పూర్తి చేయాలి. పార్టీ ఏ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ వివరాలతో పార్ట్ బీలో ఉండే అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయవచ్చు. పార్ట్ ఏలో జనరేట్ అయ్యే OTPR ఐడీతో పాటు రిజిస్ట్రేషన్ వివరాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి.

డ్రైవర్ పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకునేందుకు https://aphc.gov.in/docs/06052025-7.pdf లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు పొందవచ్చు. లేదా ఏపీ హైకోర్టు వెబ్ సైట్ లోకి వెళ్లి రిక్రూట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి నోటిఫికేషషన్ వివరాలను తెలుసుకోవచ్చు.

నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తుదారులకు ఏమైనా సందేహాలు ఉంటే helpdesk-hc.ap@aij.gov.in కు మెయిల్ చేయవచ్చు. లేదా 0863-2372752 నెంబర్ ను సంప్రదించవచ్చు. ఉదయం 10. 30 నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో కాల్స్ చేయవచ్చు. కేవలం పని దినాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం