అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ.. అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి. పదో తరగతిలో వచ్చిన మార్కులు ఆధారంగా.. సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తుల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ మే 28వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. జూన్ 16వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు https://angrau.ac.in వెబ్ సైట్ను పరిశీలించాలి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ రెండేళ్లు ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ కాలేజీల్లో 578 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అనుబంధ కళాశాలల్లో 1900 సీట్లు ఉన్నాయి. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సు కూడా రెండేళ్లు ఉంటుంది. ఇవి ప్రభుత్వ కాలేజీల్లో 25 సీట్లు, అనుబంధ కళాశాల్లో 260 సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ రెండేళ్లు ఉంటుంది. ప్రభుత్వ కళాశాల్లో 25, అనుబంధ కాలేజీల్లో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ మూడేళ్లు ఉంటుంది. ప్రభుత్వ కాలేజీల్లో 60, అనుబంధ కళాశాల్లో 330 సీట్లు ఉన్నాయి.
ఈ అన్ని కోర్సులకు కలిపి.. మొత్తం 668 సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నాయి. 2530 సీట్లు అనుబంధ కాలేజీల్లో అందుబాటులో ఉన్నాయి. బోధన ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలను వెల్లడిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని.. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కోరారు.
గ్రామీణ విద్యార్థులు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి.. ఈ వ్యవసాయ డిప్లొమా కోర్సులను పలు ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్లు అందిస్తున్నాయి. వ్యవసాయరంగంపై ఆసక్తి ఉన్నవారు వీటిలో చేరి నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. వీటిని రెండేళ్లు, మూడేళ్ల వ్యవధితో రూపొందించారు. ఉన్నత చదువులపై ఆసక్తి ఉంటే.. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో చేరిపోవచ్చు. వీరికోసం 20 శాతం సీట్లు అగ్రిసెట్ ద్వారా సూపర్ న్యూమరరీ విధానంలో భర్తీ చేస్తారు.
వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం.. పదో తరగతి గ్రేడ్ పాయింట్లు లేదా పరీక్షలో చూపిన ప్రతిభతో లభిస్తుంది. విద్యార్థులు ప్రవేశం కోరే రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లపాటు చదువుకున్నవారికి అవకాశం కల్పిస్తారు. ఏపీలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో అగ్రి పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి.
సంబంధిత కథనం