ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరంలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీలో ఆర్జీయూకేటీ యూనివర్శిటీకి నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలో క్యాంపస్లు ఉన్నాయి.
ఏప్రిల్ 27వ తేదీ నుంచి ఆర్జీయూకేటీ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారు. మే 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో ప్రవేశపెట్టిన ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సుల్ని నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్హతతో ఇందులో ప్రవేశించవచ్చు. గ్రామీణ విద్యార్ధులకు ప్రాధాన్యత ఇస్తారు. మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్శిటీ కోర్సు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హతతో పీయూసీ కోర్సు ఉంటుంది.
ఆ తర్వాత నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు ఉంటుంది.ప్రీ యూనివర్శిటీలో ఎంపీసీ, బైపీసీలకు సమానమైన కోర్సుల్ని నిర్వహిస్తున్నారు. ప్లస్ టూకు సమానమైన అర్హతతో ఈ కోర్సు ఉంటుంది. దీంతో పాటు ఐటీ లో ఫౌండేషన్ కోర్సు కూడా ఉంటుంది. ఇంజనీరింగ్ కోర్సులకు సన్నద్ధమయ్యేలా వీటిని డిజైన్ చేశారు.
ఆరేళ్ల కోర్సు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టులో బిటెక్ డిగ్రీ అందుకుంటారు. ప్రస్తుతం ఆర్జీయూకేటీలో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెటిరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో బిటెక్ పూర్తి చేయొచ్చు.
విద్యార్థుల సామర్థ్యం ఆధారంగా అదనపు క్రెడిట్స్ తీసుకోవచ్చు. టూ మేజర్ సబ్జెక్ట్ విధానంలో కంప్యూటర్ సైన్స్ తో పాటు కెమికల్, సివిల్, మెకానికల్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, మెటిరియల్ సైన్స్ డిగ్రీలు పూర్తి చేయొచ్చు. టూ మేజర్ డిగ్రీ, ఒక మేజర్, ఒక మైనర్ సబ్జెక్టుల్లో కోర్సులు పూర్తి చేయొచ్చు. మైనర్ సబ్జెక్టుల్లో బిజినెస్ మేనేజ్మెంట్, ఎకనామిక్ మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, స్టాటస్టిక్స్ కూడా చదవొచ్చు.
ఆర్జీయూకేటీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంటుంది. ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ మధుమూర్తి వైస్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మొదటి రెండేళ్లకు రూ.36వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఆర్జీయూకేటీ కోర్సుల్ని ఏటా మూడు సెమిస్టర్లుగా నిర్వహిస్తారు. ఒక్కో సెమిస్టర్లో 16వారాల పాటు ఉంటుంది. వారానికి ఆరు రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. ఏడాదిలో వారం రోజుల సంక్రాంతి సెలవులు, వారం రోజులు దసరా సెలవులు, నెల రోజులు వేసవి సెలవులు మాత్రమే ఉంటాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలలో ప్లేస్మెంట్ సౌకర్యం కూడా ఉంటుంది.
సంబంధిత కథనం