నీట్ యూజీ 2025 అభ్యర్థులకు అలర్ట్! ఈ దఫా నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన అడ్మిడ్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలోనే విడుదల చేయనుంది. 2025 మే 1 నాటికి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - అండర్ గ్రాడ్యుయేట్ 2025కు హాజరయ్యే అభ్యర్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ నుంచి తమ హాల్టికెట్స్/ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నీట్ యూజీ 2025 పరీక్షను మే 4న ఎన్టీఏ నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సింగిల్ షిఫ్టులో ఆఫ్లైన్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
అడ్మిట్ కార్డును విడుదల చేయడానికి ముందు, ఎన్టీఏ ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను విడుదల చేస్తుంది. దీని ద్వారా అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు.
ఏప్రిల్ 26 లోగా నీట్ యూజీ 2025 పరీక్ష సిటీ స్లిప్పులు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇక నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులపై అభ్యర్థులకు పరీక్ష కేంద్రం చిరునామా, వారి రోల్ నంబర్లు, ఇతర ముఖ్యమైన వివరాలు లభిస్తాయి. అడ్మిట్ కార్డులో ముఖ్యమైన పరీక్ష రోజు సూచనలు కూడా ఉంటాయి. వాటిని ముందే చదివి, కచ్చితంగా అనుసరించాలి.
పరీక్ష రోజున అభ్యర్థులు నీట్ యూజీ అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీ, చెల్లుబాటు అయ్యే- ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు, వారి ఫొటోలు వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుపై ఫొటో, గుర్తింపు కార్డుల జాబితాను పొందుపరుస్తారు.
దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష ఈ నీట్ యూజీ. ఎగ్జామ్ రాసే సంఖ్య పరంగా, ఇది దేశంలో అతిపెద్ద పరీక్షల్లో ఒకటి, ప్రతి సంవత్సరం 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ యూజీని రాస్తారు.
అభ్యర్థులు ఏదైనా సహాయం కోసం ఎన్టీఏ హెల్ప్డెస్క్ 011-40759000, 011-69227700 లేదా neetug2025@nta.ac.in వద్ద ఈమెయిల్లో సంప్రదించవచ్చు.
మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ని సందర్శించాలని అధికారులు సూచించారు.
సంబంధిత కథనం