ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు తెలంగాణలో ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు. మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ఉంటాయని అధికారులు వివరించారు. రోజూ రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అరగంట ముందు నుంచే హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు.. ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ ఈఏపీసెట్ ఎంట్రెన్స్ కోసం అభ్యర్థులు మార్చి 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు.
ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తులు స్వీకరించారు.
ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు.
ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 24 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 9 వరకు రూ. 250 ఆలస్య రుసుము, ఏప్రిల్ 14 వరకు రూ. 500 ఆలస్య రుసుము నిర్ణయించారు.
ఏప్రిల్ 18 వరకు రూ. 2500 ఆలస్య రుసుము, ఏప్రిల్ 24 వరకు రూ. 5 వేల ఆలస్య రుసుము చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఈఏపీసెట్ హాల్ టికెట్లు ఏప్రిల్ 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. జేఎన్టీయూ హైదరాబాద్ వెబ్సైట్ లోకి వెళ్లి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి.
మే 2 నుంచి 4వ తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.
ఫలితాలను ప్రకటించిన తర్వాత.. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తారు.
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం స్థానికతపై సవరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే దక్కుతాయని స్పష్టం చేసింది. దీంతో ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలోనే అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పూర్తి సమాచారం, వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.