డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి నైపుణ్యాలను పెంచే కోర్సులు, నూతన సిలబస్, సాంకేతిక హంగులను ప్రవేశపెట్టారు. ప్రతి సెమిస్టర్లో ఒక టెక్నాలజీ సబ్జెక్టును ప్రవేశపెడుతున్నట్టు అధికారులు వివరిస్తున్నారు. ఇంగ్లీష్ సబ్జెక్టులోనూ నైపుణ్యాలు పెంచేలా మార్పు చేస్తున్నారు. ఈ చర్యల కారణంగా.. విద్యార్థులకు డిగ్రీతోనే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణలో కొన్నేళ్లుగా డిగ్రీ కోర్సు రూపురేఖలు మారుతూ వచ్చాయి. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్తో సెమిస్టర్ విధానం, నాలుగేళ్ల సబ్జెక్టులను ఎంచుకునే బకెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గత రెండేళ్ల నుంచి చదువుకుంటూనే.. పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తూ స్టైపెండ్ పొందే అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏఈడీపీ) కోర్సులు కొన్ని కళాశాలల్లో అందుబాటులోకి వచ్చాయి.
తెలంగాణలో 28 ప్రభుత్వ కళాశాలల్లో అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ పేరిట కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నారు. రెండేళ్ల కిందట ఇలాంటి కోర్సులను కొన్ని ప్రముఖ కళాశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈసారి మరిన్ని కళాశాలలకు విస్తరిస్తున్నారు. బీకాం (బీఎఫ్ఎస్ఐ), ఈ-కామర్స్ ఆపరేషన్స్, రిటైల్ ఆపరేషన్స్, టూరిజం అండ్ హాస్పిటాలజీ ఆపరేషన్స్, బీఎస్సీ డిజిటల్/ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ మార్కెటింగ్ అండ్ సేల్స్, బీఎస్సీ ఇన్ ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ, బీబీఏ ఇన్ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నారు.
ఆయా కోర్సుల్లో నైపుణ్యాలను నేర్పించి.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వీటిలో చేరిన వారు సాయంత్రం వేళ, వారాంతాల్లో ఆయా రంగాలకు సంబంధించిన స్టోర్లలో, కార్యాలయాల్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తారు. వారికి నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు స్టైపెండ్ రూపేణా అందుతుంది.
దోస్త్ ప్రవేశ ప్రక్రియ సులభంగా ఉంటుంది. విద్యార్థులు ఈజీగా డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. దోస్త్ వెబ్సైట్ను సందర్శించి.. ఇంటర్ హాల్ టికెట్ నంబరుతో లాగిన్ అవ్వాలి. పేరు నమోదు చేసుకోవాలి. దీనికి ఆధార్ నంబర్తో అనుసంధానం చేసిన మొబైల్ ఉంటే చాలు. రూ.200 చెల్లిస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత దోస్త్ ఐడీ, పిన్/పాస్వర్డ్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ తెరవడానికి వాటిని ఉపయోగించాలి.
దోస్త్ ద్వారా మొత్తం మూడు విడతల్లో ప్రవేశాలు జరగనున్నాయి. మొదటి విడతలోనే ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకుంటే.. నాణ్యమైన, కోరుకున్న కాలేజీల్లో సీట్లు దొరికే అవకాశాలు ఉంటాయి. డిగ్రీ సీట్ల భర్తీలోనూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. ఈసారి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ను అమలు చేయనున్నారు.
తొలి విడత నోటిఫికేషన్ విడుదల- మే 2
రిజిస్ట్రేషన్ ప్రారంభం- 3 నుంచి 21వ తేదీ వరకు (ఫీజు రూ.200)
వెబ్ ఆప్షన్లు- 10 నుంచి 22 వరకు
సీట్ల కేటాయింపు- మే 29న
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్- మే 30 నుంచి జూన్ 6 వరకు
కాలేజీల్లో రిపోర్టింగ్- జూన్ 24 నుంచి 28 వరకు
తరగతుల ప్రారంభం- జూన్ 30న
సంబంధిత కథనం