జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షలో తప్పు ప్రశ్నలకు మార్కులు ఇస్తారా? ఎన్టీఏ ఏం చెబుతోంది?-jee main marking scheme 2025 what if an answer is wrong will students get full marks ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షలో తప్పు ప్రశ్నలకు మార్కులు ఇస్తారా? ఎన్టీఏ ఏం చెబుతోంది?

జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షలో తప్పు ప్రశ్నలకు మార్కులు ఇస్తారా? ఎన్టీఏ ఏం చెబుతోంది?

Sudarshan V HT Telugu

జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 2 ఫలితాలు ఏప్రిల్ 17న విడుదల అవుతున్నాయి. అయితే, జేఈఈ మార్కింగ్ స్కీమ్ గురించి విద్యార్థుల్లో అనేక అనుమానాలు ఉంటాయి. ఆ సందేహాలకు ఎన్టీఏ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి.

జేఈఈ మెయిన్స్ 2025

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2025 సెషన్ 2లో అడిగిన కనీసం తొమ్మిది ప్రశ్నల్లో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు, నిపుణులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎన్టీఏ ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఆధారంగా నిర్ధారణకు రావద్దని కోరింది. అనవసర సందేహాలు, ఆందోళన కలిగించే వార్తలతో అభ్యర్థులను తప్పుదోవ పట్టించవద్దని కోరింది.

పూర్తి పారదర్శకంగా..

ఎన్టీఏ ఎల్లప్పుడూ పారదర్శక పరీక్ష ప్రక్రియను అనుసరిస్తుందని, ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైన వెంటనే అభ్యర్థులు తమ రికార్డు చేసిన ప్రతిస్పందనలను చూడటానికి అనుమతిస్తుందని తెలిపింది. ప్రొవిజనల్ ఆన్సర్ కీలోని ప్రతి సవాలును ఎన్టీఏ చాలా సీరియస్ గా పరిగణిస్తుంది' అని ఎన్టీఏ ఇటీవల ఎక్స్ లో పోస్ట్ చేసింది.

ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు

ప్రశ్నలు, వాటికి అభ్యర్థుల సమాధానాలతో పాటు ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఎన్టీఏ విడుదల చేసింది. ఆ తర్వాత ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అనుమతించింది. అభ్యంతర విండో క్లోజ్ అయిన తర్వాత ఆ అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణుల ప్యానెల్ సమీక్షిస్తుంది. అభ్యంతరాలు ఉంటే అందుకు అనుగుణంగా ఫైనల్ ఆన్సర్ కీని సవరిస్తారు. ఫైనల్ ఆన్సర్ కీ నుంచి తప్పు సమాధానాలను తొలగిస్తారు.

జేఈఈ మెయిన్ 2025: మార్కింగ్ స్కీమ్

జేఈఈ మెయిన్ పరీక్షల మార్కింగ్ స్కీమ్ ఈ కింది విధంగా ఉంటుంది.

  • సరైన లేదా అత్యంత సముచితమైన సమాధానానికి నాలుగు మార్కులు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. ప్రయత్నించని ప్రశ్నలకు ఏ మార్కులు ఇవ్వరు.
  • ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సరైనవిగా ఏజెన్సీ కనుగొంటే, సరైన ఆప్షన్లలో ఒకదానిని సమాధానంగా మార్క్ చేసి వారికి పూర్తి మార్కులు వస్తాయి. ఒకవేళ అన్ని ఆప్షన్లు కరెక్ట్ అయితే, ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన అందరికి ఫుల్ మార్కులు వస్తాయి.
  • ఒక ప్రశ్నను తొలగించాల్సి వస్తే అభ్యర్థులందరికీ పూర్తి మార్కులు ఇస్తామని ఎన్టీఏ పేర్కొంది.

న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలకు మార్కింగ్ స్కీమ్

  • సరైన సమాధానం: నాలుగు మార్కులు (+4)
  • తప్పు సమాధానం: మైనస్ ఒక మార్కు (-1)
  • సమాధానం ఇవ్వని ప్రశ్నలకు: నో మార్క్ (0).

ఒక ప్రశ్న తప్పుగా తేలితే లేదా ప్రశ్నను తొలగించినట్లయితే: అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు (+4).

జేఈఈ మెయిన్ రెండో సెషన్ ఫలితాలు ఏప్రిల్ 17న వెలువడనున్నాయి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఏజెన్సీ అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం