ఐఐటీకి వెళ్లాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దేశవ్యాప్తంగా 1364 సీట్లు పెరుగుతాయి!-good news for students who want to go to iit 1364 seats will be increased across the country ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఐఐటీకి వెళ్లాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దేశవ్యాప్తంగా 1364 సీట్లు పెరుగుతాయి!

ఐఐటీకి వెళ్లాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దేశవ్యాప్తంగా 1364 సీట్లు పెరుగుతాయి!

Anand Sai HT Telugu

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో సీట్లు పెరుగుతాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీటెక్ కోర్సులో అత్యధికంగా సీట్లు పెరగనున్నాయి.

ఐఐటీల్లో సీట్ల పెరుగుదల

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో సీట్లు పెరుగుతాయి. 23 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో 2025-26 సెషన్‌లో గత సంవత్సరంతో పోలిస్తే 1,364 సీట్లు అదనంగా అందుబాటులో ఉంటాయి. బి.టెక్, ఎం.టెక్, పీహెచ్.డి కోర్సుల్లో సీట్లు పెంచనున్నారు. సీట్లలో గరిష్ట పెరుగుదల బి.టెక్ కోర్సులలో ఉంటుంది.

బీటెక్‌లో అత్యధిక సీట్లు

బీటెక్‌లో సీట్ల సంఖ్యను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జేఓఎస్ఏఏ) విడుదల చేయనుంది. ఐఐటీలో ఏ బ్రాంచిలో ఎన్ని సీట్లు పెంచుతారో జేఓఎస్ఏఏ చెబుతుంది. మే చివరి వారంలో సీట్ల జాబితాను ప్రచురించనుంది. ఈసారి బీటెక్‌లో అత్యధిక సీట్లు పెరగనున్నాయి. 2024లో 23 ఐఐటీల్లో 17740 బీటెక్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 2025లో 23 ఐఐటీల్లో 18,500 సీట్లలో ప్రవేశానికి ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

డిమాండ్ ఉన్న విభాగాల్లో

ఐఐటీలు జమ్మూ, భిలాయ్, తిరుపతి, ధార్వాడ్, పాలక్కాడ్లలో 2025-26 విద్యా సంవత్సరంలో మరిన్ని సీట్లను పెంచనున్నట్లు జేఓఎస్ఏఏ అధికారులు తెలిపారు. కొత్త సీట్లు ఉద్యోగానికి అనువైన, మార్కెట్ డిమాండ్ ఉన్న టెక్నాలజీ విభాగాల్లో ఉంటాయి. తద్వారా విద్యార్థులు తమ డిగ్రీకి ముందే ఉద్యోగ ఆఫర్లు పొందేలా అవకాశాలు చూడొచ్చు. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి కొత్త, అభివృద్ధి చెందుతున్న విభాగాలలో ఈ పెరుగుదల ఉంటుంది. ఇవి నేడు అత్యంత డిమాండ్ ఉన్న రంగాలుగా మారాయి.

కౌన్సెలింగ్!

దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలతో సహా 50కి పైగా ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో 60 వేలకు పైగా సీట్లలో ప్రవేశానికి నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియను మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో జేఓఎస్ఏఏ విడుదల చేయనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే సీట్ మ్యాట్రిక్స్‌ను కూడా జేఓఎస్ఏఏ విడుదల చేయనుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్