రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 16 వేల 347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఏడేళ్ల తర్వాత వచ్చిన అవకాశం కావడంతో.. అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో నిరుపేద అభ్యర్థుల కోసం ప్రభుత్వం ఉచిత శిక్షణ అందిస్తోంది. పరీక్షలకు సంసిద్ధం అయ్యేలా చేస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమశాఖ ద్వారా.. 5 వేల 50 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 600 మంది విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లోని ఏపీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకుంటున్నారు. మిగిలిన 4వేల 460 మందికి జిల్లాల్లోని ఎంపిక చేసిన కేంద్రాల ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నారు.
కాకినాడ జిల్లాలో ఆదిత్య పోటీ పరీక్షల శిక్షణ సంస్థ, శ్యామ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా 600 మందికి కోచింగ్ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకునే వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు అన్ని ఖర్చులనూ ప్రభుత్వమే భరిస్తుంది. ఎస్జీటీ అభ్యర్థులకు బోధనా రుసుము కింద రూ.10వేలు, స్టడీ మెటీరియల్కు రూ.3వేలు, భోజన ఖర్చులకు రూ.4,500 చెల్లిస్తారు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు బోధనా రుసుము కింద రూ.12వేలు, స్టడీ మెటీరియల్కు రూ.3వేలు, భోజన ఖర్చులకు రూ.4,500 చెల్లిస్తారు.
'ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల కోసం శిక్షణ పొందాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాలి. నిరుపేదలకు ఇది మోయలేని భారంగా మారుతోంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పూర్తి వసతులతో ఉచితంగా ప్రభుత్వమే అందిస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగమే లక్ష్యంగా సంసిద్ధం కావాలి. ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది. కష్టపడి చదివి విజయం సాధించాలి' అని సాంఘిక సంక్షేమశాఖ అధికారులు సూచిస్తున్నారు.
నోటిఫికేషన్ విడుదల తేదీ- ఏప్రిల్ 20, 2025
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ- ఏప్రిల్ 20, 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ- మే 15, 2025
హాల్ టికెట్ల డౌన్లోడ్- మే 30, 2025 నుండి
పరీక్ష తేదీలు- జూన్ 6, 2025 నుండి జూలై 6, 2025 వరకు
ఒక్కో పోస్టు దరఖాస్తుకు రూ.750, ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు.
అభ్యర్థులు ఆన్లైన్లో ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నింపాలి.
అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి.
దరఖాస్తును సమర్పించి, ప్రింట్ తీసుకోవాలి.
సంబంధిత కథనం