ఏపీ మెగా డీఎస్సీ.. ఎలా ప్రిపేర్ అవుతున్నారు..? ఈ 8 అంశాలను అస్సలు మర్చిపోవద్దు-expert tips for ap mega dsc 2025 preparation ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ మెగా డీఎస్సీ.. ఎలా ప్రిపేర్ అవుతున్నారు..? ఈ 8 అంశాలను అస్సలు మర్చిపోవద్దు

ఏపీ మెగా డీఎస్సీ.. ఎలా ప్రిపేర్ అవుతున్నారు..? ఈ 8 అంశాలను అస్సలు మర్చిపోవద్దు

మెగా డీఎస్సీ కోసం అభ్యర్థులు గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పోటీ తీవ్రంగా ఉంటుందని భావించి కఠిన సాధన చేస్తున్నారు. కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే.. విజయం సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేకమైన అంశాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డీఎస్సీ ప్రిపరేషన్ టిప్స్ (unsplash)

విద్యాశాఖ ద్వారా 16 వేల 347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సుమారు 6 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు సరైన ప్రణాళికతో చదివితే ఉద్యోగాన్ని సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలకు 40 రోజులు మాత్రమే ఉంది. ఈ సమయంలో పక్కా ప్రణాళికతో చదవాలని స్పష్టం చేస్తున్నారు.

ముఖ్యమైన 8 అంశాలు..

1.జూన్‌ 6 నుంచి ప్రారంభమై జులై 6 వరకూ డీఎస్సీ పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో వీటిని నిర్వహిస్తారు.

2.ఎడ్యుకేషన్‌ సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, ఎస్‌జీటీ కంటెంట్, మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు, స్కూల్‌ అసిస్టెంట్‌కు ఆరు నుంచి ఇంటర్‌మీడియట్‌ వరకూ ఉంటుంది.

3.ప్రణాళికాబద్ధంగా గత ప్రశ్నపత్రాలను పరిశీలించి సన్నద్ధం కావాలి. మోడల్‌ ప్రశ్నపత్రాలు సాధన చేస్తూ.. వెనుకబడిన వాటిని ఎక్కువగా చదవాలి.

4.జనరల్ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌ ఎస్‌జీటీకి 8 మార్కులు, స్కూల్‌ అసిస్టెంట్‌కు 10 మార్కులకు ఉంటుంది. విద్యా దృక్పథాలు ఎస్‌జీటీకి 4 మార్కులు, స్కూల్‌ అసిస్టెంట్‌కు 5 మార్కులకు ఉంటుంది. వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.

5.జీకే, కరెంట్‌ అఫైర్స్‌ గత ఆరు నెలల జాతీయ, రాష్ట్ర, అంతర్జాతీయ అంశాలు చూస్తూ.. గత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. అప్పుడు వాటిపై పూర్తి అవగాహన వస్తుంది.

6.దరఖాస్తుకు వయసు పరిమితిని పెంచారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా సాధన చేస్తున్నవాళ్లూ ఉంటారు. పోటీ తీవ్రంగా అంటే.. సగటున ఒక ఉద్యోగానికి 40 మంది వరకూ పోటీ పడే అవకాశం ఉందని అంచనా.

7.ఈ నోటిఫికేషన్‌లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2678 పోస్టులున్నాయి. 543 పోస్టులతో శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంది. కొంతమంది నాన్‌లోకల్‌ రాయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారు జాగ్రత్తగా పరిశీలించి వెళ్లాలి. ఎందుకంటే 20 శాతం ఓపెన్‌ కేటగిరీ ఉద్యోగాలకు మాత్రమే అర్హులుగా ఉంటారు. నాన్‌ లోకల్‌లో రిజర్వేషన్‌ విధానం వర్తించదు.

8.గత ప్రశ్నపత్రాలు పరిశీలిస్తూ.. మోడల్‌ పేపర్‌లను సాధన చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 10 నుంచి 12 గంటలు సాధన చేస్తే పంతులు కొలువు సాధించవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ- మే 15

పరీక్ష తేదీలు- జూన్‌ 6 నుంచి జులై 6 వరకు

అర్హతలు- పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఎడ్, డీఎడ్, డీఈఈడీ, ఏపీటెట్‌/సీటెట్‌ స్కోరు

వయసు- 2024 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు- రూ.750

అధికారిక వెబ్‌సైట్‌: https://apdsc.apcfss.in/

సంబంధిత కథనం