టెన్త్​, ఐటీఐ అర్హతతో 45 ఉద్యోగాలు - ఈసీఐఎల్ హైదరాబాద్‌ నుంచి నోటిఫికేషన్, వివరాలివే-ecil hyderabad recruitment 2025 notification for 45 technician jobs key details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  టెన్త్​, ఐటీఐ అర్హతతో 45 ఉద్యోగాలు - ఈసీఐఎల్ హైదరాబాద్‌ నుంచి నోటిఫికేషన్, వివరాలివే

టెన్త్​, ఐటీఐ అర్హతతో 45 ఉద్యోగాలు - ఈసీఐఎల్ హైదరాబాద్‌ నుంచి నోటిఫికేషన్, వివరాలివే

ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా 45 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి. జూన్‌ 5వ తేదీతో గడువు ముగుస్తుంది.

టెక్నీషియన్ ఉద్యోగాలు - ఈసీఐఎల్ హైదరాబాద్ ప్రకటన

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 45 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జూన్‌ 5వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది.

ఖాళీలు - అర్హతల వివరాలు…

ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే వారు 2025 ఏప్రిల్ 30వ తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ ఉన్నవాళ్లకు వయోపరిమితి విషయంలో సడలింపులు ఉంటాయి. ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, మెషనిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, టర్నర్‌, షీట్‌ మెటల్‌, వెల్డర్‌, కార్పెంటర్‌, పెయింటర్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

పోస్టును బట్టి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ పాసై ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 20,480 జీతం చెల్లిస్తారు.

మొత్తం 45 పోస్టులు ఉండగా.. వీటిలో ఓపెన్ కేటగిరిలో 20 ఉన్నాయి. ఓబీసీ కోటాలో 18, ఈడబ్యూఎస్ కింద 4, ఎస్సీ కోటాలో 2, ఎస్టీ కోటా కింద 1 పోస్టు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు జూన్‌ 5వ తేదీతో ముగుస్తుంది.

ఎంపిక విధానం ఇలా….

ఈ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షతో పాటు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షకు 85 శాతం, ట్రేడ్ టెస్ట్ కు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. మెరిట్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే ట్రేడ్ టెస్ట్ కు పిలుస్తారు. అభ్యర్థుల ఎంపిక 1:4 నిష్పత్తిలో ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్షల కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఉంటాయి. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.

రాత పరీక్ష వివరాలు…

రాత పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. మొత్తం గంటన్నర సమయం ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం మరో 20 నిమిషాల సమయం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పుగా ఆన్సర్ చేస్తే 0.25 కట్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు మాధ్యమంలో ఉంటుంది. ట్రేడ్ టెస్టుకు సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే hrrect@ecil.co.in లేదా madhaviaurorab@ecil.co.in కు మెయిల్ చేయవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://www.ecil.co.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించుకోవచ్చు. ఇక ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయిన తర్వాత… హాల్ టికెట్ విడుదల, పరీక్ష తేదీల వివరాలను ప్రకటిస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్