CBSE Exams : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండుసార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు-cbse 10th 12th board exams 2 times students can attend twice in a year from 2026 academic year ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Cbse Exams : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండుసార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు

CBSE Exams : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండుసార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు

Anand Sai HT Telugu
Jan 09, 2025 01:30 PM IST

CBSE 10th, 12th Exams : ఏడాదికి రెండుసార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహించడంపై కేంద్రం సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. తాజాగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయంపై మాట్లాడారు.

ఏడాదికి రెండుసార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు
ఏడాదికి రెండుసార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు (Unsplash)

వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి సీబీఎస్ఈ సహా వివిధ బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయి. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయాన్ని అమలు చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ) సిఫారసుల మేరకు 11, 12 తరగతుల్లో సెమిస్టర్ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం, హయ్యర్ సెకండరీ తరగతులకు సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం రెండూ విద్యా వ్యవస్థలో ప్రధాన సంస్కరణలలో ముఖ్యమైన భాగాలు అని కేంద్రమంత్రి అన్నారు.

yearly horoscope entry point

తక్కువ మార్కులొస్తే మళ్లీ

10, 12వ తరగతి విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు పరీక్షకు హాజరుకావడం తప్పనిసరి కాదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈ ఆప్షన్‌ను ప్రవేశపెడుతున్నారు. ఒక విద్యార్థి మొదటిసారి పరీక్ష స్కోరుతో సంతృప్తి చెందకపోతే, తదుపరిసారి మళ్లీ పరీక్షకు హాజరుకావొచ్చు. ఈ ఏడాది రెండు బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉత్తమ స్కోరు తీసుకుంటారు. ఉత్తమ స్కోర్ ఆధారంగా ఫలితాల మెరిట్‌ను నిర్ణయిస్తారు.

ఎన్సీఎఫ్ సూచన

జాతీయ విద్యావిధానం 2020 అమలు కోసం తీసుకువచ్చిన నేషనల్ కరిక్యూలమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్) ముసాయిదా కమిటీ ఒక విద్యా సంవత్సరంలో రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయడానికి విద్యార్థులను అనుమతించాలని సిఫార్సు చేసింది. ఇందులో ఉత్తమ మార్కులు మాత్రమే ఉంచుతారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించాలని కేంద్ర విద్యాశాఖ సీబీఎస్ఈని కోరింది.

2024-25 విద్యాసంవత్సరం నుంచి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని మంత్రిత్వ శాఖ తొలుత భావించింది. అయితే ఇప్పుడు దాన్ని పొడిగించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని ఆప్షనల్ ప్రాతిపదికన అమలు చేసే అవకాశం ఉందని 2024 ఫిబ్రవరిలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.

నిపుణులు ఏమంటున్నారంటే

కేంద్రమంత్రి మంత్రి తాజా ప్రకటనపై పుణేకు చెందిన విద్యా నిపుణుడు ప్రొఫెసర్ శంతను కమాతే స్పందించారు. బోర్డు పరీక్షలకు హాజరు కావడానికి సంవత్సరానికి రెండు ఆప్షన్లు ఇవ్వడం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఒక విద్యార్థి పరీక్షకు ప్రిపేర్ అయిన తర్వాత పరీక్షకు మళ్లీ ప్రయత్నించవచ్చు అని అన్నారు. సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి సమయం అవసరమయ్యే, ఫెయిల్యూర్ భయం ఉన్న బలహీన విద్యార్థులకు ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.

Whats_app_banner